ఆదివాసీలే అటవీ శత్రువులా...! | Forest enemies of tribal residents | Sakshi
Sakshi News home page

ఆదివాసీలే అటవీ శత్రువులా...!

Aug 4 2015 12:17 AM | Updated on Sep 3 2017 6:43 AM

ఆదివాసీలే అటవీ శత్రువులా...!

ఆదివాసీలే అటవీ శత్రువులా...!

కేవలం పదేళ్లలోనే దేశంలో బహుళ జాతి కంపెనీల వల్ల రెండు లక్షల ఎకరాల అడవి నాశనం అయ్యిందని ప్రభుత్వ అధికారిక సర్వేలు తెలుపుతున్నాయి.

కేవలం పదేళ్లలోనే దేశంలో బహుళ జాతి కంపెనీల వల్ల రెండు లక్షల ఎకరాల అడవి నాశనం అయ్యిందని ప్రభుత్వ అధికారిక సర్వేలు తెలుపుతున్నాయి. మరి అడవిని నాశనం చేస్తున్నారని పాలకులు ప్రజలపై నెపం మోపడం ఏమిటి?  తెలంగాణ ఉద్యమంలో కోట్ల గొంతులు ఒక్కటై నినదించిన భూమి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.  
 
 ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు సాగు చేసుకుంటున్న రెండు లక్షల ఎకరాలకుపైగా పోడు భూములను స్వాధీనం చేసుకో వాలని, వాటిలో నర్సరీలను పెంచాలని తెలంగాణ ప్రభు త్వం ప్రయత్నాలు ఆరంభిం చింది. తెలంగాణలో ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని భద్రాచ లం, కొత్తగూడెం, ములుగు, మంథని, ఉట్నూర్, ఆసిఫా బాద్ డివిజన్‌లలో గిరిజనులు, గిరిజనేతరుల అధీనం లోని పోడు భూములను ప్రభుత్వమే ఆక్రమించే ప్రక్రియ ప్రస్తుతం వేగం పుంజుకుంది. ఇందుకోసం సాగుదా రులకు అటవీ శాఖ నోటీసులు కూడా పంపింది.
 
 ఈ నోటీసులను ప్రజలు తిరస్కరిస్తున్నా, ఆ భూములపైకి పోలీసుల దన్నుతో సర్వే చేయిస్తున్నారు. చివరకు పట్టా లున్న వారికి కూడా నోటీసులు వచ్చాయి. ఇదేం అన్యా యమని అడగలేని స్థితిలో రాజకీయ పక్షాలున్నాయి. ఒకవైపు గిరిజనులకు మూడెకరాల భూమి కొని ఇస్తా మంటున్న ప్రభుత్వం ఉన్న భూములను బలవంతంగా గుంజుకోవడం ఘోరం. తెలంగాణలో అటవీ విస్తరణ లక్ష్యం పైకి చూడటానికి మంచిగానే ఉంది కాని లక్షలాది గిరిజనులకు దీనివల్ల కాళ్లకింది భూమి తమది కాకుండా కదిలిపోనుంది.
 
 అటవీ హక్కుల చట్టం కింద సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని 17 మండలాల్లో 155 గ్రామాలకు చెందిన 32,775 మంది ఐటీడీఎని 2006లో అభ్యర్థించారు. చట్టం ప్రకారం వీరందరికీ 84,617 ఎక రాల భూమికి పట్టాలివ్వవలసి ఉండగా, 17,252 దరఖా స్తులను అటవీ హక్కుల కమిటీ తిరస్కరించింది. సబ్ డివిజనల్ కమిటీ స్థాయిలో మరో 3,939 దరఖాస్తులను తిరస్కరించారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్ హయాంలో 50 శాతం వరకు పట్టాలిచ్చారు. తర్వాత 7,242 మంది కొత్తగా పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండు దశల్లోనూ దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు పట్టాలివ్వని ప్రభుత్వం వారినే భూ ఆక్రమణ దారులని ప్రభుత్వం అంటోంది.
 
 ఎన్నో సుదీర్ఘ పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ చట్టంలోని కీలకాంశాల అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. కేవలం పది సంవత్సరాల కాలంలోనే (1995-2005) దేశంలో మైనింగ్ రంగంలో ఉన్న బహుళజాతి కంపెనీల వల్ల రెం డు లక్షల ఎకరాల అడవి నాశనమైందని ప్రభుత్వ అధికా రిక సర్వేలు తెలుపుతున్నాయి. ఇంకా అనధికారికంగా ఆ లెక్క మరో పదింతలున్నా ఆశ్చర్యం లేదు. మరి అటవిని నాశనం చేస్తున్నారని పాలకులు ప్రజలపై నెపం మోప డం ఏమిటి?
 
 తెలంగాణ ప్రభుత్వ విధానం చట్టాలను ఉల్లంఘిం చడమే కాదు. అధికారంలోకి రాక పూర్వం చేసిన వాగ్దా నాలు, ఆ తర్వాత మాట్లాడుతున్న విధానాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నాయి. దళితులకు మూడెకరాల భూమి నినాదం అంటూ ఎంతో ఆకర్షణీయంగా ప్రచా రం చేసిన వారు ఇప్పటికి పంచిందెంత? ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ప్రభుత్వ సర్వే ప్రకారం కేవలం నాలు గు మండలాల్లోనే  ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. మరి మిగతా చోట్ల ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటి? పోనీ భూస్వాముల చేతుల్లో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోగలదా అంటే అదీ లేదు. మరి ప్రభుత్వం దళిత, గిరిజనులకు కుటుంబానికి మూడెకరాల భూమి ఎక్కడి నుంచి తెచ్చివ్వగలదు? ఇచ్చే ఉద్దేశం పాలకులకు ఉంటే గిరిజన, గిరిజనేతరుల పేద ప్రజలు సాగు చేసుకుం టున్న భూముల ఆక్రమణకు ప్రభుత్వం ఎందుకు పూను కుంటుందో ప్రభుత్వం జవాబు చెప్పాలి.
 
 పేదల భూములను గుంజుకొని పారిశ్రామికవేత్త లకు కట్టబెట్టే విధానాన్ని అవలంబిస్తున్న ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం జనాకర్షక నినాదాలతో ప్రజలను మోసం చేస్తున్నాయి. అసలు సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే దేశం లోని, రాష్ట్రంలోని మిగులు భూములపై ప్రభుత్వాలు ఇప్పటికీ సరైన లెక్కలు చూపటం లేదు. 1932లో నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో భూ సమగ్ర సర్వే జరి గింది. తర్వాత ఇక్కడి భూములపై భూస్వాముల పెత్తనమే సాగుతూవచ్చింది. జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ కింద తెలంగాణ ప్రభుత్వానికి 500 కోట్ల నిధులు (అంటే 50 శాతం) కేంద్ర ప్రభుత్వం అంది స్తుంది. అయితే ప్రభుత్వం రికార్డుల ఆధునీకరణ జరి గినా ప్రజల పక్షం వహిస్తుందంటే అనుమానమే.
 
మా భూములు మాక్కావాలె అంటూ నినదించిన ప్రజలకు భూమి పంచుతామని వాగ్దానం చేసిన తెలం గాణ ప్రభుత్వం ఉన్న భూములనే బలవంతంగా గుంజు కోవడానికి ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కోట్ల గొంతులు ఒక్కటై నినదించిన భూమి సమస్యను పరిష్కరించడానికి పోరాటమే ఇప్పటికీ మార్గంగా ఉం ది. పోడు భూములపై ప్రభుత్వ ఆక్రమణకు వ్యతిరేకం గా పోరాటం చేపట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది. తరాలుగా అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాల పరిపూర్తి కోసం అన్ని శక్తులూ ఏకమై ప్రభుత్వ పోడు భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడాలి.
 (వ్యాసకర్త తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రధాన కార్యదర్శి) మొబైల్: 98499 96300
 - నలమాస కృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement