ఐసీయూ గ‌ది తాళం దొర‌క్క ఆగిన ప్రాణం

Woman Deceased After Fail To Find ICU Key In Madhya Pradesh - Sakshi

ఇండోర్‌: ఆసుప‌త్రిలో ఐసీయూ గ‌ది తాళం చెవి దొర‌క్క‌పోవ‌డంతో స‌కాలంలో చికిత్స అంద‌క ఓ మ‌హిళ క‌న్నుమూసిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. గురువారం ఉజ్జ‌యిన్ జిల్లాకు చెందిన‌ యాభై ఐదేళ్ల మ‌హిళ‌కు అధిక ర‌క్త‌పోటుతోపాటు శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. దీంతో ఆమెను హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వైద్యులు మాధ‌వ్ న‌గ‌ర్‌లోని మ‌రో ఆసుప‌త్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. కానీ ఆ ఆసుప‌త్రి క‌రోనా ప‌రీక్ష‌ల కోసం నిర్దేశించినందున అంబులెన్సులో "ఆర్డీ గార్డీ మెడిక‌ల్‌ ఆసుప‌త్రి"కి తీసుకెళ్లారు. తీరా అక్క‌డికి వెళ్లేస‌రికి అత్య‌వ‌స‌ర విభాగ‌మైన‌ ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌) గ‌దికి తాళం వేసి ఉంది. స‌రైన సిబ్బంది కూడా అక్క‌డ అందుబాటులో లేరు. (రూ.1.90 లక్షలకే వెంటిలేటర్‌)

మ‌రోవైపు ఆమె ప‌రిస్థితి క్ష‌ణ‌క్ష‌ణానికి మ‌రింత దిగ‌జారుతుండ‌టంతో ఐసీయూ గ‌ది తాళాన్ని ప‌గ‌ల‌గొట్టారు. కానీ అప్ప‌టికే ఆల‌స్యం కావ‌డంతో వైద్యులు ఆమె ప్రాణాల‌ను కాపాడ‌లేక‌పోయారు. ఈ ఘ‌ట‌న గురించి ఉజ్జ‌యిని జిల్లా వైద్యాధికారి అన‌సూయ గాలి మాట్లాడుతూ.. "బాధితురాలు బీపీ, మ‌ధుమేహం వంటి దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆసుపత్రికి తీసుకు వ‌చ్చిన వెంట‌నే ముందుగా వైద్యులు ఆమె నుంచి కోవిడ్‌-19 న‌మూనాల‌ను సేక‌రించారు. కానీ ఆ స‌మ‌యంలో ప‌రిస్థితి క్షీణించి మ‌ర‌ణించింది. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నాం" అని పేర్కొన్నారు. కాగా ఈ మ‌హిళ‌తోపాటు మ‌రో రోగికి స‌కాలంలో వెంటిలేట‌ర్లు అందించ‌క వారి చావుకు కార‌ణ‌మైన ఇద్ద‌రు వైద్యుల‌ను విధుల నుంచి తొల‌గించారు. (లాక్‌డౌన్‌: మహిళను కాల్చి చంపిన జవాను!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top