‘మీరెందుకు లేట్?’ | Why are you late? | Sakshi
Sakshi News home page

‘మీరెందుకు లేట్?’

Jan 5 2016 1:47 AM | Updated on Sep 3 2017 3:05 PM

పఠాన్‌కోట్ ఉగ్ర ముష్కరుల పాక్ మూలాలపై మరిన్ని ఆధారాలు వెల్లడయ్యాయి. పంజాబ్ పోలీస్ ఎస్పీ సల్వీందర్ సింగ్, అతడి

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్ర ముష్కరుల పాక్ మూలాలపై మరిన్ని ఆధారాలు వెల్లడయ్యాయి. పంజాబ్ పోలీస్ ఎస్పీ సల్వీందర్ సింగ్, అతడి స్నేహితుడు రాజేశ్‌వర్మలను కిడ్నాప్ చేసిన నలుగురు ఉగ్రవాదులు పాక్‌లోని తమ పర్యవేక్షకుడితో చేసిన సంభాషణను రాజేశ్ వర్మ వెల్లడించాడు. ఉగ్రవాదులు గొంతు కోయడంతో ప్రాణాపాయ స్థితిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. వర్మ అందించిన వివరాల మేరకు ఉగ్రవాదులు, పాక్‌లో ఉన్న వారి పర్యవేక్షకుడి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది..

 పాక్ పర్యవేక్షకుడు: ‘మీతో పాటు బయల్దేరిన ఇద్దరు ఇప్పటికే లక్ష్యాన్ని(ఎయిర్‌బేస్) చేరుకున్నారు. మీరెందుకు వెనకబడ్డారు?’
 వాహనంలోని ఉగ్రవాదులు: ‘మేం కూడా లక్ష్యం దగ్గర్లోనే ఉన్నాం. దార్లో చాలా పోలీస్ పికెట్స్ ఉన్నాయి. అందువల్ల లేట్ అయింది’.
 ఈ సంభాషణను బట్టి భద్రతాదళాలు అప్రమత్తం కావడానికి చాలా ముందే ఇద్దరు ఉగ్రవాదులు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి చేరగలిగారని అర్థమవుతుంది. ఆ తరువాత జనవరి 1 తెల్లవారు జామున మిగతా నలుగురు ఉగ్రవాదులు లక్ష్యాన్ని చేరుకున్నారని తెలుస్తోంది. ఆ తరువాతే పఠాన్‌కోట్ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి గస్తీని, తనిఖీలను ముమ్మరం చేశారు.

పఠాన్‌కోట్ పరిసరాల్లో ఉగ్రవాదుల ఉనికిపై అధికారులు అప్రమత్తంగా లేకపోవడం వల్ల కూడా విలువైన సమయం వృధా అయిందని భావిస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి ఎస్పీ సల్వీందర్ సింగ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి వదిలాక. టైస్టులు తమను కిడ్నాప్ చేశారంటూ సల్వీందర్  చెప్పిన విషయాన్ని బలగాలు సీరియస్‌గా తీసుకోలేదు. సల్వీందర్ సింగ్ మాటలను విశ్వసించి ఉంటే, రెండో బ్యాచ్‌లోని నలుగురు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లోకి చేరకుండా నిరోధించే అవకాశం లభించేదన్న వాదన వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement