
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యులు న్యాయవాద వృత్తిలో కొనసాగకుండా నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు అటార్నీ జనరల్(ఏజీ) సాయం కోరింది. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అశ్వినికుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్ వేశారు.
పార్లమెంట్ సభ్యులు, శాసనసభ, మండలి సభ్యులు లాయర్లుగా కొనసాగడం ‘విరుద్ధ ప్రయోజనాల’కిందికి వస్తుందని, అడ్వకేట్ల చట్టం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘిస్తోందని అందులో పేర్కొన్నారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణలో సహకరించాల్సిందిగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను కోరింది. లాయర్లుగా కొనసాగుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు క్లయింట్ల నుంచి ఫీజు, ప్రజా ఖజానా నుంచి జీతాలు అందుకుంటున్నారని, ఇది వృత్తి పరంగా ఆమోదయోగ్యం కాని విధానమని అశ్వినికుమార్ అన్నారు. ప్రజా ప్రతినిధులుగా టీవీలు, రేడియోల్లో చర్చా కార్యక్రమాల్లో పాల్గొని లాయర్లుగా తమ బ్రాండ్ విలువను పెంచుకుంటున్నారని ఆరోపించారు.