రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫైకి ఇక గుడ్‌బై..! | In Railway Stations Google To End Its Free WiFi Journey | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫైకి ఇక గుడ్‌బై..!

Feb 18 2020 9:46 AM | Updated on Feb 18 2020 9:46 AM

In Railway Stations Google To End Its Free WiFi Journey - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫై సర్వీసుపై గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.  దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో అందిసున్న ఉచిత వైఫైను గూగుల్‌  ఎత్తివేస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ విషయంపై గూగుల్‌ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా స్పందిస్తూ.. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ సేవలు చాలా చవకగా మారిపోయాయి. అందువల్లనే భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనూ ఉచిత వైఫై సేవలను ఎత్తివేయనున్నాం.

ఐదేళ్ల క్రితం గూగుల్ స్టేషన్లు ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు  డేటా వాడకం సులభతరంగా, చవకగా మారింది. మొబైల్ డేటా ప్లాన్లు చాలా తక్కువ రేట్లకు అందుబాటులోకి వచ్చాయి. 2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ వేగవంతమైన, ఉచిత పబ్లిక్ వైఫై సేవలను ఆరంభించింది. 2020 నాటికి 400కు పైగా రైల్వే స్టేషన్లలో అమర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా.. జూన్ 2018 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించినట్టు సీజర్ చెప్పారు. 

మొబైల్ కనెక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు భారత్‌లో మొబైల్ డేటా లభ్యమవుతోంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మొబైల్ డేటా ధర 95 శాతం తగ్గింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే గూగుల్ రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సర్వీసు ఎత్తివేత నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement