
రాహుల్ గాంధీతో అఖిలేష్ పొత్తు?
సమాజ్వాది పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయన్న అంశంపై వివిధ వర్గాల రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
న్యూఢిల్లీ: సమాజ్వాది పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయన్న అంశంపై వివిధ వర్గాల రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ వర్గం తన బాబాయ్ శివపాల్ యాదవ్ వర్గాన్ని కాదని, లేదా కాలదన్ని స్వతంత్య్రంగా పోటీ చేయాల్సి వస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుపెట్టుకుంటారన్న విషయంలో అప్పుడే చర్చ మొదలైంది.
ఎప్పుడూ తన రాజకీయ మిత్రుడిగానే భావించే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో అఖిలేశ్ యాదవ్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీని పలుసార్లు బహిరంగంగా ప్రశంసించిన అఖిలేష్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘ఖూన్ కీ దళాయి’ అంటూ రాహుల్ చేసిన విమర్శలను కూడా సమర్థించారు.
‘కాంగ్రెస్ పార్టీతో నాకు సంబంధం లేదుగానీ రాహుల్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మోదీ గురించి రాహుల్ చేసిన విమర్శలు సమంజసమేనని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ అనాలోచితంగా ఎలాంటి వమర్శలు చేయరు’ అని అఖిలేశ్ వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. రాహుల్తో అఖిలేష్ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని, మున్ముందు రాజకీయంగా ఆయనతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని వదులుకోరాదనేదే అఖిలేష్ ఉద్దేశమని ఆయన సన్నిహితులు తెలిపారు.
సమాజ్వాది పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చలు జరిపింది. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీ హాజరవడం మరో విశేషం. ఎన్నికలకు ముందే రాజకీయ పొత్తులు పెట్టుకుంటే మంచిదనే విషయాన్ని కొంత మంది రాష్ట్ర నాయకులు ప్రియాంక గాంధీకి సమావేశంలో సూచించారట.
అయితే ఆమె దానికి ఎలాంటి సమాధానం చెప్పలేదట. సమాజ్వాది పార్టీ నుంచి అఖిలేశ్ వర్గం విడిపోయిన పక్షంతో అ పక్షంతో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన కూడా సమావేశం ముందుకు వచ్చిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడే తొందర పడి నిర్ణయానికి రాకూడదని, పరిణామాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడినట్లు తెలిసింది.
అటు మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్వాది పార్టీని, మరోపక్క బలపడుతున్న భారతీయ జనతా పార్టీని సమర్థంగా ఎదుర్కొవాలన్నా... ప్రభుత్వ వ్యతిరేక ఓటును తప్పించుకోవాలన్నా బాబాయ్ వర్గాన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు అఖిలశ్శ్ కు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.