ఆస్తులు చెప్పని 401 మంది ఎంపీలు | Sakshi
Sakshi News home page

ఆస్తులు చెప్పని 401 మంది ఎంపీలు

Published Mon, Oct 27 2014 3:38 AM

ఆస్తులు చెప్పని 401 మంది ఎంపీలు - Sakshi

జాబితాలో సోనియా గాంధీ, అద్వానీ, రాజ్‌నాథ్
 
న్యూఢిల్లీ:  కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, ఉమాభారతి, నితిన్ గడ్కారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, బీజేపీ అగ్రనేత అద్వానీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్... వీరంతా తమ ఆస్తులు, అప్పుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ 26 నాటికి మొత్తం 401 వుంది ఎంపీలు తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాల్సి ఉందని సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు లోక్‌సభ సెక్రటేరియెట్ బదులిచ్చింది.

 

నిబంధనల ప్రకారం ఎంిపీగా ప్రమాణం చేసిన 90 రోజుల్లోగా సభ్యులు తమ ఆస్తుల వివరాలను తెలపాలి. ఆస్తుల వివరాలు తెలియజేయని ఎంపీలలో 209 మంది బీజేపీ వారే. కాంగ్రెస్ నుంచి 31, టీఎంసీ 27, బీజేడీ 18, టీడీపీ 14, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన 8  మంది ఎంపీలు కూడా ఆస్తుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.

అక్రమ సంపాదన కాదు: సదానందగౌడ

బెంగళూరు: ఎన్నికల తర్వాత తన ఆస్తి భారీగా పెరిగిందని, ఇదంతా అక్రమ సంపాదనే అని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని రైల్వే మంత్రి సదానంద గౌడ స్పష్టం చేశారు. మంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఆస్తి విలువ పెరిగినంత మాత్రాన అదంతా అక్రమ సంపాదన అనడం సరికాదన్నారు.

 

ఎన్నికల అనంతరం ఫెడరల్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు అప్పు తీసుకున్నానని, బెంగళూరు న్యూ బీఈఎల్ రోడ్‌లోని తన బహుళ అంతస్తుల భవనంలో కిరాయిదారుల నుంచి రూ.2 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నానని వెల్లడించారు. ఇందువల్ల ఎన్నికల అనంతరం తన ఆస్తి విలువ పెరిగిందే కానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు.
 

Advertisement
Advertisement