
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్మంతర్, బోట్క్లబ్ వంటి ప్రాంతాల్లో నిరసనలు, బైఠాయింపులపై పూర్తి నిషేధం విధించటం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు బదులు అక్కడ ప్రజలు స్వేచ్ఛగా నిరసనలు తెలిపేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. జంతర్మంతర్, ఇండియా గేట్ దగ్గరి బోట్ క్లబ్ వద్ద వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఆందోళనలు చేపట్టరాదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) విధించిన నిషేధానికి వ్యతిరేకంగా మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ తదితర స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది.
అత్యవసర పరిస్థితుల్లో శాంతి భద్రతల సమస్య, హింసాయుత పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే విధించే 144వ సెక్షన్ వంటి ఆజ్ఞల్ని అధికారులు అమలు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై ఎన్జీటీ తరఫు లాయర్ వాదిస్తూ..‘జంతర్మంతర్ రోడ్డులో వివిధ సంఘాలు, సంస్థలు, పార్టీలు చేపట్టే ఆందోళనల కారణంగా ప్రజా జీవనానికి ఆటంకం కలగటంతోపాటు, శబ్దకాలుష్యం, తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. పూర్తిస్థాయి నిషేధం తగదని, ప్రజల నిరసన హక్కుకు భంగం కలగకుండా మార్గదర్శకాలు రూపొం దించాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.