నగర శివారు ప్రాంతమైన నాలాసొపారలో శనివారం ఉదయం ఓ ఇంట్లో ...
సాక్షి, ముంబై: నగర శివారు ప్రాంతమైన నాలాసొపారలో శనివారం ఉదయం ఓ ఇంట్లో సంభవించిన పేలుడు ఘటనలో ఇద్దరు తీవ్రగాయాల పాల య్యారు. మరో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. బాధితులంతా సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఎం. డి.నగర్లోని మహాలక్ష్మీ అపార్టుమెంట్ బి-వింగ్లోని ఓ ఫ్లాటులో ఉదయం ట్యూబ్లైట్ స్విచ్ వేయగానే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఇంటితోపాటు ఇరుగుపొరుగు ఇళ్లలో కూడా సామగ్రి చిందరవందరగాపడిపోయాయి.
భయంతో ఇళ్లల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. వంట గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంవల్ల లైట్ స్విచ్ వేయగానే పేలి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్థారణకు వచ్చారు. పేలుడుగల కారణాలు తెలుసుకునేందుకు మరింత లోతుగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.