
దీదీయే ‘కీ’లకం
కోల్కతా : ఈనెల 23 తర్వాత ప్రధాని అధికారిక నివాసం తాళాలు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేతికి వస్తాయని ఆమె మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. కాగా తన కార్యాలయం ఉన్న భవనాన్ని తాను ఆక్రమించుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలపై ఆయనకు లీగల్ నోటీసు పంపుతానని హెచ్చరించారు.
ఎంపీ అభిషేక్ తన నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ఉన్న భవనాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆరోపించారు. అభిషేక్ ప్రాతినిథ్యం వహించే డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టిన ప్రధాని మోదీ సిటింగ్ ఎంపీపై ఈ ఆరోపణలు గుప్పించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన ప్రధాని 48 గంటల్లోగా క్షమాపణ చెప్పకపోతే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అభిషేక్ హెచ్చరించారు. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పకుంటే తాను ఆయనకు లీగల్ నోటీసు పంపుతానని అభిషేక్ స్పష్టం చేశారు.