సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

Sakshi Excellence Awards 2019

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పలు విభాగాల్లో సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానం జరిగింది. ‘జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సీనియ ర్‌ నటుడు కృష్ణంరాజు, ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ దర్శకుడిగా నాగ్‌అశ్విన్, ఉత్తమ చిత్రం గా ‘మహానటి’కి అవార్డులు ప్రదానం చేశారు. ఇంకా పలువురు నటీనటులు, సాంకేతిక నిపు ణు లు ‘సాక్షి’ ఎక్సలెన్స్‌ అవార్డులు అందుకున్నారు.

వైఎస్‌. రాజశేఖరరెడ్డిగారు అంటే నాకెంతో ఇష్టం. ఆయన నన్ను రాజా అని పిలిస్తే నేను ఆయన్ను రాజా అని పిలిచేవాణ్ణి. ఆయన కుమారుడు జగన్‌గారు పెట్టిన ఈ ‘సాక్షి’ భారతిగారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కొనసాగుతుంది.’  నటుడు కృష్ణంరాజు

‘సాక్షి’ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా హుందాగా ఉంటుంది.’  – దర్శకుడు పూరి జగన్నాథ్‌

‘సాక్షి’ అవార్డులు చాలా జెన్యూన్‌గా ఉంటాయి.’ – నటుడు– నిర్మాత రామ్‌ చరణ్‌

అని శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌’ని కొనియాడారు. పలు విభాగాల్లో ఈ అవార్డులను పలువురు ప్రముఖులు అందుకున్నారు. ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌’ ఎంపిక జాబితాలో జాతీయ అవార్డులు సాధించిన ‘మహానటి, రంగస్థలం, అ!, చి!ల!సౌ’ చిత్రాలు ఉండటం విశేషం. ఈ కార్యక్రమంలో ‘మధుర’ శ్రీధర్, నవీన్‌ ఎర్నేని, రాజారవీంద్ర, కృష్ణుడు  తదితరులు పాల్గొన్నారు.

ట్రెండ్‌ని సెట్‌ చేసేందుకు కష్టపడ్డా –కృష్ణంరాజు
నేను నా సినిమాల్లో ఫైట్స్‌ అన్నీ డూప్‌ లేకుండా నిజంగా చేసినవే. అటువంటి ఫైట్స్‌ చేసి ప్రేక్షకుల నుంచి కాంప్లిమెంట్స్‌ పొందినప్పటికీ నేను మాత్రం రెండు కాళ్లు, కుడి చెయ్యి విరగ్గొట్టుకున్నాను(నవ్వుతూ). ఎన్నిసార్లు హాస్పిటల్‌కు వెళ్లానో నాకు తెలుసు(నవ్వుతూ). అప్పట్లో ఇలా ట్రెండ్‌ని సెట్‌ చేయడానికి నేను పనిచేశా, కష్టపడ్డాను. విలన్‌గా చేయమని దర్శకులు అడిగితే ఒప్పుకోలేదు. అయితే విలన్‌ పాత్రలను నా స్టైల్లో చేస్తాను, మీకు ఓకే అయితే చేస్తానన్నాను. ఫైట్స్‌ దగ్గర నుంచి పిస్టల్‌తో పేల్చడం వరకు ప్రతిదీ కొత్తగానే ప్రయత్నించాను. ‘మదర్‌ ఇండియా, బంగారు తల్లి’ లాంటి సినిమాల్లో చాలా డిఫరెంట్‌గా చేశా. ఒక ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టినప్పుడు చాలా అవమానాలు వచ్చాయి. అప్పట్లో హీరోయిన్స్‌ని ముట్టుకోకుండా ఆమడ దూరంలో ఉండి చేసే విధానం ఉండేది. నా ఉద్దేశం ఏంటంటే మగవాళ్లు, ఆడవాళ్లు సమానమే అనేది. అందుకే ‘కృష్ణవేణి’ సినిమాను తెలుగు ప్రేక్షకులు గుర్తించుకోగలిగేలా తీయగలిగాను. ఈ సినిమాను చూసిన హీరో ఎన్టీఆర్‌ గారు మెచ్చుకున్నారు. ‘భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న’ లాంటి సినిమాల్లో ట్రెండ్‌ని సెట్‌ చేశాం. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి.. నేనూ మంచి స్నేహితులం. ఆయన నన్ను ఎంతమందిలో చూసినా ‘ఏం రాజా’ అంటూ పిలిచేవారు. నేను కూడా ఆయన్ని ‘రాజా’ అంటూ పిలచేవాణ్ణి. ‘సాక్షి’ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన యాజమాన్యానికి నా అభినందనలు. ‘సాక్షి’ నన్ను గుర్తించి ‘జీవితసాఫల్య పురస్కారం’ అందించడం అత్యంత సంతోషదాయకంగా భావిస్తున్నా.

నా పుట్టిల్లు ఇచ్చిన అవార్డు ఇది – అనసూయ

‘సాక్షి’ మీడియా నా పుట్టినిల్లు. అదే పుట్టినిల్లు నుంచి నా నటనను మెచ్చుకుని ఎక్స్‌లెన్స్‌ అవార్డు ఇవ్వడం గర్వంగా ఉంది. నేను ‘సాక్షి’ ద్వారానే గుర్తింపు తెచ్చుకోగలిగాను. ‘రంగమ్మత్త’ లాంటి క్యారెక్టర్‌ ద్వారా నన్ను తెలుగు ప్రేక్షకుల్లో గుర్తుండేలా చేసిన దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞలు. రామ్‌చరణ్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్‌ లాంటి పేరుమోసిన ఆర్టిస్ట్‌లతో షూటింగ్‌లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ‘రంగస్థలం’ లోని ‘ఓయ్‌ చిట్టిబాబూ’ అంటూ హీరో రామ్‌చరణ్‌ని వేదిక మీద పిలవడంతో ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో సందడి చేశారు.

అదే నిజమైన అవార్డు – రామ్‌చరణ్‌
‘‘రంగస్థలం’ సినిమా నాకే కాదు, యూనిట్‌ అందరికీ మరచిపోలేని చిత్రం. నిజంగా రెండు కారణాల వల్ల ఈ అవార్డు తీసుకున్నాను. ఈ మధ్య కాలంలో నిజాయతీగా జనాలు ఓటు వేసి అవార్డులు రావడం అనేది చాలా తక్కువ. ఓ జ్యూరీ కమిటీ ఉంటుంది. వారందరూ కూర్చుని ఎంపిక చేస్తారు. అయితే జనాల్లో నుంచి వచ్చినప్పుడే అది నిజమైన అవార్డు. సాక్షి మీడియా జనాల నుంచి ఓటింగ్‌ సిస్టమ్‌ని క్రియేట్‌ చేసి చాలా నిజాయతీగా ఐదేళ్ల నుంచి సౌత్‌ ఇండియాలో అవార్డులు ఇస్తుండటం అభినందనీయం. ఏ అవార్డు తీసుకున్నా ఆనందం రాదు.. మరి ఇలాంటి అవార్డు తీసుకున్నప్పుడు ఓ ఆర్టిస్టుకు నిజంగా ఏదో గెలిచామనే ఆనందం వస్తుంది. ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్యూ.. ఇలాంటి అవార్డుల వేడుక ఇంకా ఇంకా కొనసాగాలి. మరో కారణం ఏంటంటే... ఆ వ్యక్తి లేకుంటే, నన్ను కలవకపోయి ఉంటే ఈ అవార్డు లేదు. చాలా మొండోడు.. గట్టోడు. ఏదైనా సాధించేవరకూ వదలడు.

పెన్ను పట్టుకుని పేపర్‌ మీద రాయడం మొదలు పెడితే కథతో, డైలాగులతో, పాత్రలతో ప్రేమలో పడిపోతారు... ఆయనే సుకుమార్‌. ఆయన డైరెక్టర్‌ అయ్యారు కానీ, స్కూల్‌లో లెక్కల మాస్టారులా ఎలా ఉన్నారో షూటింగ్‌లోనూ అంతే.. ఆయన అనుకున్న లెక్కలు వచ్చే వరకూ వదలడు.. ఆ సన్నివేశం అర్థమయ్యేవరకూ మమ్మల్ని వదలడు. స్కూల్‌ టీచర్‌లా మమ్మల్ని అలా చెక్కుతూ చెక్కుతూ మంచి నటన రాబట్టుకున్నారు.. థ్యాంక్యూ సుక్కు. నువ్వు అలా రాబట్టుకున్నావు కాబట్టే రంగమ్మత్త నుంచి దేవిశ్రీ, రత్నవేలుగారికి.. ఇలా అందరికీ ఈ ప్రయాణం సులభమైంది ఈ సినిమా చేయడానికి.. సో హాట్యాఫ్‌ సుక్కు. ‘రంగస్థలం’ సినిమా చేయడానికి నీ ఆలోచనలే నీ బలం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. జాతీయ అవార్డుకు ఎంపికైన వారందరికీ అభినందనలు. నన్ను హీరోగా పరిచయం చేసన మా డైరెక్టర్‌ (పూరి జగన్నాథ్‌) మొన్ననే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తో హిట్‌ కొట్టారు.. ఈ మధ్యనే మాట్లాడాను.. ఏంటో చరణ్‌.. హిట్‌ చూసి మూడేళ్లయింది అన్నారు.. సార్‌.. ఇది మామూలే.. మేమూ అలాంటివి చూశాం. కానీ మీరు మంచి లవబుల్‌ డైరెక్టర్‌. ప్రేక్షకులు ఒక్కసారి ప్రేమిస్తే మళ్లీ మరచిపోరు.. మీ సినిమా కోసం వేచి చూస్తారంతే.. థ్యాంక్యూ’’ అన్నారు.

భారతమ్మ చల్లని నీడలో ‘సాక్షి’ – పూరి జగన్నాథ్‌
‘సాక్షి’ అంటే నాకు చాలా అభిమానం. ‘సాక్షి’తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ‘సాక్షి’ని స్థాపించింది మన పెద్దాయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు. ఇప్పుడు ఈ మీడియా సంస్థ భారతమ్మ చల్లని నీడలో విజయపథంలో వెళ్లడం ఆనందంగా ఉంది. ప్రతిఏటా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రతిభావంతులికి ఇవ్వడం నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. నా చేత కూడా అవార్డులు ఇప్పించినందుకు సంతోషిస్తున్నా. కృష్ణంరాజుగారి సినిమాలు చూసి పెరిగినవాణ్ణి. అప్పట్లో ఆయన సినిమాల్లోని ఫైట్స్‌కి ‘డిహే డిహే’ అని సౌండ్స్‌ వచ్చేవి. ఆ సౌండ్స్‌ కూడా ట్రెండే.

అవార్డు అందుకున్న వేదికపై అవార్డు ఇవ్వడం హ్యాపీ –హాస్యనటుడు అలీ

‘సాక్షి’ మీడియా నాకు ఇదే వేదికపై అవార్డు ఇచ్చింది. ఆరోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదే వేదికపై నా చేత అవార్డు ఇప్పించిన ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. అప్పట్లో నరేష్‌గారిని చూస్తే హిందీ హీరో వస్తున్నాడు అనే చర్చ జరిగేది. అటువంటి మంచి నటుడికి నేను అవార్డ్‌ ఇవ్వడం గర్వంగా భావిస్తున్నా.

గౌరవంగా భావిస్తున్నా –నరేష్‌

నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమా రంగ ప్రవేశం చేశాను. దర్శకులు జంధ్యాలగారు, మా అమ్మ విజయనిర్మలగారు నా గురువులు. నా మొదటి సినిమాను జంధ్యాలగారి దర్శకత్వంలో చేయడం గర్వంగా ఉంది. అదే విధంగా బాపు, విశ్వనాథం, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ రంగరావుగార్ల దర్శకత్వాల్లో సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాను. నేను అవార్డు కోసం సినిమా చేయను. చేసిన సినిమాకు అవార్డు రావాలని ఎదురు చూస్తుంటాను. ‘రంగస్థలం, మహానటి, సమ్మోహనం’ లాంటి చిత్రాల్లో మంచి పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాను. ఇందుకు నేను గర్విస్తున్నాను. ‘సాక్షి’లాంటి ఉన్నత మీడియా నా నటనను మెచ్చుకుని నాకు అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను.

నా తొలి అవార్డు – రాహుల్‌ రవీంద్రన్‌

ఇది  నా జీవితంలో తొలి అవార్డు. ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. వారికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. ఏడేళ్ల క్రితం ఇదే రోజు నేను నటించిన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’ విడుదలైంది. ఈ సినిమా అత్యంత ప్రేక్షకాదరణ పొందినా అవార్డును అందుకోలేకపోయాను. ఆ సమయంలో హీరో నాని నాతో ఓ మాట అన్నాడు. ‘రాహుల్‌... డెబ్యూ ఫిల్మ్‌కి అవార్డు ఒకటి కొట్టు. జీవితంలో గుర్తుండిపోతుందని అన్నాడు. కానీ నేను సాధించలేకపోయాను. నా ఏడేళ్ల సినిమా ప్రయాణంలో ‘సాక్షి’ అందించిన ఈ అవార్డే ఫస్ట్‌ది. అందుకు నేను సాక్షికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ అవార్డు అందుకోవడం గర్వంగానూ ఉంది.

జీవితాంతం రుణపడి ఉంటా –అజయ్‌ భూపతి

నా మనసులో ఉన్న భావాన్ని, నేను ఎలా సినిమా తీయాలనుకుంటున్నాను అనే నా ఆలోచల్ని టెక్నీషియన్స్‌ గుర్తించారు. ‘పిల్లా రా.. ’ అనే పాటలు ఊపిరిపోశాయి. నేను చెప్పిన ప్రతి సీన్‌కి వాళ్లు ఊపిరిపోయబట్టే ‘ఆర్‌ఎక్స్‌–100’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయినే విలన్‌. అందుకే హీరోయిన్‌గా, విలన్‌గా రెండు అవార్డులు పాయల్‌కు రావడం ఆనందంగా ఉంది. డైరెక్టర్‌గా నన్ను ‘సాక్షి’ గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం పట్ల జీవితాంతం రుణపడి ఉంటాను.

‘సాక్షి’ నాకు నచ్చిన మీడియా –ఛార్మి

‘సాక్షి’ నాకు నచ్చిన మీడియా. చాలా హానెస్ట్, జెన్యూన్, సూపర్‌ టాలెంట్‌. ఈ మీడియాతో నేను చాలా అనుబంధంగా ఉంటాను. చాలా ఫీలింగ్స్‌ కూడా ఉన్నాయి. అటువంటి మీడియా సంస్థ నన్ను ఆహ్వానించి, నా ద్వారా అవార్డును ప్రదానం చేయించడం ఆనందంగా ఉంది. ఎక్స్‌లెన్స్‌ అవార్డులను అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

తెలుగు సినిమా ఎక్స్‌లెంట్‌ –రెజీనా

తెలుగు చిత్రాలు జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడం ఆనందంగా ఉంది. అటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేను కూడా భాగస్వామిని అవడం గర్వంగా ఉంది. తెలుగు సినిమా నిజంగా ఎక్స్‌లెంట్‌. పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా పాత్రలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రేక్షకులతో పాటు ‘సాక్షి’ మీడియా నన్ను గుర్తించి ‘ఎక్స్‌లెన్స్‌’ అవార్డును ఇవ్వడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

చిన్న నటుడికి అవార్డు ఇచ్చినందుకు సాక్షికి థ్యాంక్స్‌ – సంపూర్ణేష్‌ బాబు

నేనొక చిన్న నటుణ్ణి. నా నటనను మెచ్చుకుని మెగా ఫ్యామిలీ నుంచి కాంప్లిమెంట్స్‌ రూపంలో వీడియో రావడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా నా లాంటి చిన్న నటుణ్ణి గుర్తించి ఎక్స్‌లెన్స్‌ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి థ్యాంక్స్, రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని మూడు నిమిషాల నిడివిగల డైలాగ్‌ని చెప్పి అలరించాడు.

నిజమైన అవార్డు – దేవిశ్రీప్రసాద్‌

కష్టపడినవాడిని గుర్తించి ఈ అవార్డు ఫలనా వ్యక్తికే చెందినది అంటూ ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ప్రదానం చేయడం సంతోషంగా ఉంది. ఇది నిజమైన అవార్డు. గతంలో కూడా ‘సాక్షి’ నాకు అవార్డు ప్రకటించింది. ఆ సమయంలో నేను ఇండియాలో లేకపోవడం వల్ల అందుకోలేని పరిస్థితి. అయినా ఆ అవార్డు దేవిశ్రీ ప్రసాద్‌కే చెందినది అంటూ నా తమ్ముణ్ణి (సాగర్‌)ని పిలిచి అవార్డు ఇవ్వడం ఆనందంగా అనిపించింది. అందుకే ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్‌ అవార్డును రియల్‌ అవార్డుగా పరిగణిస్తున్నా. నేను సంగీతం అందించిన ప్రతి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ నాకు ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తున్నందుకు గర్వంగా ఉంది.

ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయా – పాయల్‌ రాజ్‌పుత్‌
‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా నా జీవితంలో గుర్తుండిపోయే ఓ మైలురాయి. ఆ సినిమాతో నేను ఓవర్‌నైట్‌ స్టార్‌ని అయిపోయా. దర్శకుడు అజయ్‌ భూపతి నన్ను ఎందుకు హీరోయిన్‌గా ఎంచుకున్నారో సినిమా విడుదలయ్యాక తెలిసింది. ఆ సినిమా అత్యంత ప్రజాదరణ పొందబట్టే నన్ను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. నాకు ఇంత మంచి పేరు వచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్‌ చెబుతున్నా (ఆనంద భాష్పాలతో). తెలుగు సినీ పరిశ్రమ నాకొక మంచి అవకాశాన్ని, గుర్తింపును తెచ్చిపెట్టింది. అటువంటి ఓ మంచి సినిమాకి సాక్షి అవార్డు ఇవ్వడం నేను గర్వంగా ఫీలవుతున్నా.

గర్వంగా ఉంది – పూజాహెగ్డే
‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి మంచి సినిమాకు నాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా అభినయం, అందానికి మెచ్చి నాకు ఈ సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డు రావడం హ్యాపీ. అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. అ అవార్డుకు ప్రధాన కారణం దర్శకుడు త్రివిక్రమ్‌. ఆయన నా మీద నమ్మకంతో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి ఫ్రేమ్‌లో నన్ను హుందాగా, అందంగా చూపించారు. హీరోయిన్‌ పాత్రతో పంచ్‌లు వేయించడం ఆయనకే చెల్లింది.

గోదావరి ప్రజలకు అంకితం – రత్నవేలు
గోదావరి పరిసర ప్రాంతాల్లో ‘రంగస్థలం’ షూటింగ్‌ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించాం. తెలుగు సినిమాటోగ్రఫీ ఇంత గొప్పగా ఉంటుందా? అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌గారికి, రామ్‌చరణ్‌గారికి థ్యాంక్స్‌. సాక్షి ఇచ్చిన ఈ అవార్డుని గోదావరి ప్రజలకు అంకితం ఇస్తున్నా.

కథ అమ్మలాంటిది – సునీల్‌
సినిమాల కోసం నేను హైదరాబాద్‌ వచ్చినప్పుడు రచయిత త్రివిక్రమ్‌ నన్ను ఆదరించాడు. నేను సినిమాల్లో నటించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. సినిమాకి కథ అమ్మలాంటిది. అటువంటి కథకు త్రివిక్రమ్‌ ప్రాణం పోస్తారు.  స్క్రిప్ట్‌రాసే వాడు అమ్మలాంటి వారైతే... దర్శకుడు తండ్రిలాంటి వాడు. తల్లి, తండ్రి కలిసి సినిమాను తీసి, సినిమా ద్వారా ప్రపంచానికి మాలాంటి వారిని పరిచయం చేస్తున్నారు. ఈ రోజు ‘సాక్షి’ నుంచి అందుకున్న అవార్డు నాకు ఎంతో ప్రత్యేకమైనది. దీనికి ప్రధాన కారణం త్రివిక్రమే.

ఇంకేం ఇంకేం కావాలి – అనంత శ్రీరామ్‌
అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటకు అవార్డు రావడం ‘ఇంకేం ఇకేం కావాలే’ అన్నట్టుగా ఉంది. పురస్కారం అనేది ఒక విజయం, ఒక గుర్తింపు. అటువంటి పురస్కారాన్ని సాక్షి నన్ను గుర్తించి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ‘గీత గోవిందం’ సినిమా డైరెక్టర్‌ పరశురామ్‌గారు నాపై నమ్మకంతో పాట రాసే అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ పాట రాసి 300 మిలియన్‌ ప్రేక్షకులు ఆదరించగలిగే సామర్థ్యాన్ని తెచ్చుకోవడం సంతోషంగా ఉంది.

ప్రత్యేక గుర్తింపు – నిధీ అగర్వాల్‌
‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు నేను హీరోయిన్‌గా పరిచయం అయ్యాను. దీనికి ప్రధాన కారణం హీరో నాగచైతన్య. ఆయనకు థ్యాంక్స్‌. దర్శకుడు చందూమొండేటి నన్ను వెతికి మరీ హీరోయిన్‌గా సెలక్ట్‌ చేయబట్టే మీ ముందు ఇలా ఉన్నాను. ‘సాక్షి’ ప్రత్యేకంగా నన్ను గుర్తించి నా నటన మెచ్చుకుని ఎక్స్‌లెన్స్‌ అవార్డును ప్రదానం చేయడం సంతోషంగా ఉంది.

కష్టానికి ప్రతిఫలం –అడివి శేషు
వందశాతం కష్టపడి ‘గూఢచారి’ సినిమాను తీశాను. సినిమా ప్రేక్షాకాదరణ పొందటమే కాకుండా నన్ను ఉన్నత శిఖరంలో నిలబెట్టింది ఈ సినిమా. వందశాతం కష్టపడి చేశాను కాబట్టే సాక్షి నన్ను గుర్తించి ఎక్స్‌లెన్స్‌ అవార్డును ప్రదానం చేసింది. అందుకు సాక్షికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కష్టానికి ప్రతి ఫలమే ఎక్స్‌లెన్స్‌ అవార్డు.

ఈ అవార్డు ప్రత్యేకం – చిన్మయి
గాయనిగా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా కుటుంబ ప్రోత్సాహమే. ఇంతమంది కథానా యికలకు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నాను అంటే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటమే కారణం.  నా భర్త రాహుల్‌ రవీంద్రన్‌ నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, నా భుజం తడుతూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ఈ రోజు సాక్షి అవార్డు అందుకోవడం ప్రత్యేకం. సోషల్‌ మీడియాలో అభినందనలతో పాటు తిట్లు వస్తుంటాయి. నేను కూడా అదే రీతిలో స్పందిస్తుంటాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top