తలైవా ఇంట పెళ్లి సందడి
తమిళనాడు, పెరంబూరు: సూపర్స్టార్ రజనీకాంత్ ఇంటి పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి వాతావరణంతో స్థానిక పోయెస్గార్డెన్లోని తలైవా ఇల్లు కళకళలాడుతోంది. రజనీకాంత్ రెండో కూతురు, దర్శకురాలు సౌందర్య రెండో పెళ్లికి ముస్తాబవుతోంది. ఈమె రజనీకాంత్ హీరోగా కోచ్చడైయాన్ వంటి త్రీడీ యానిమేషన్ చిత్రానికి, ధనుష్ హీరోగా నటించిన వీఐపీ–2 చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈమె 2000 సంవత్సరంలో అశ్విన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు.
ఆ తరువాత మనస్పర్థల కారణంగా దంపతులు విడిపోయి విడాకులు పొందారు. తరువాత అశ్విన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా రజనీకాంత్ కూతురు, దర్శకురాలు సౌందర్య రెండో పెళ్లికి సిద్ధమైంది. ఈమె విశాఖన్ అనే యువ వ్యాపారవేత్తను పెళ్లాడనుంది. విశాఖన్ ప్రముఖ వ్యాపారవేత్త వణంగాముడి కొడుకు అన్నది గమనార్హం. సౌందర్య, విశాఖన్ల పెళ్లి ఫిబ్రవరి 11న చెన్నైలోని ఒక కల్యాణమండపంలో బ్రహ్మాండంగా జరగనుంది. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం.
అభిమానులకు అభినందనలు: నటుడు రజనీకాంత్ బుధవారం తన అభిమానులను ప్రత్యక్షంగా కలిశారు. రజనీ ప్రజా సంఘం ద్వారా డెల్టా జిల్లాల్లోని గజ తుపాను బాధితులను ఆదుకునే విధంగా పలు రకాలుగా సహాయ కార్యక్రమాలను నిర్వహించిన సంఘ కార్యకర్తలను రజనీకాంత్ తన ఇంటికి పిలిపించి ప్రశంసించారు.