తిత్లీ బాధితులకు ‘సినీ’ సాయం
తిత్లీ తుఫాన్తో శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం కలిగిన సంగతి తెలిసిందే. బాధితులకు తమవంతుగా సాయం అందించేందుకు మంగళవారం హైదరాబాద్లో దర్శకుల సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు యన్.శంకర్, ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ దర్శకుల సంఘం తరఫున తిత్లీ తుఫాన్ బాధితులకు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మరికొంత మంది దర్శకుల సంఘం సభ్యులు కూడా వ్యక్తిగతంగా విరాళాలు ప్రకటించారు.
వీటన్నిటినీ త్వరలోనే వసూలు చేసి ఏక మొత్తంగా తుఫాన్ బాధితుల సహాయనిధికి అందిస్తామని వారు తెలిపారు. ఎటువంటి ప్రకృతి విపత్తు జరిగినా సినిమా పరిశ్రమ స్పందించటం పరిపాటి. ఈ కోవలోనే ‘తిత్లీ’ బాధితుల కోసం హీరో జూనియర్ ఎన్టీఆర్ 15 లక్షలు, కల్యాణ్ రామ్ 5 లక్షలు, హీరో కార్తికేయ 2లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి అందించారు. మరో హీరో నిఖిల్ కూడా 25 క్వింటాళ్ల బియ్యం, 500 దుప్పట్లను బాధితులకు స్వయంగా అందజేశారు. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా తనవంతుగా రెండు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.