4 గంటల్లో.. పాట పాడేసింది! | laxmi manchu sings maiden song in just 4 hours | Sakshi
Sakshi News home page

4 గంటల్లో.. పాట పాడేసింది!

Apr 3 2015 6:00 PM | Updated on Sep 2 2017 11:48 PM

4 గంటల్లో.. పాట పాడేసింది!

4 గంటల్లో.. పాట పాడేసింది!

లక్ష్మీ మంచు కొత్త అవతారంలోకి ప్రవేశించింది. కొన్నాళ్లు టీవీ హోస్ట్గా, తర్వాత నటిగా.. ఆపై నిర్మాతగా కూడా వ్యవహరించిన ఆమె.. ఇప్పుడు గాయనిగా మారింది.

లక్ష్మీ మంచు కొత్త అవతారంలోకి ప్రవేశించింది. కొన్నాళ్లు టీవీ హోస్ట్గా, తర్వాత నటిగా.. ఆపై నిర్మాతగా కూడా వ్యవహరించిన ఆమె.. ఇప్పుడు గాయనిగా మారింది. వంశీకృష్ణ దర్శకత్వంలో వస్తున్న 'దొంగాట' సినిమా కోసం ఆమె ఓ పాట పాడింది. తన మొట్టమొదటి పాటను ఆమె కేవలం నాలుగు గంటల్లోనే రికార్డు చేసేసిందట. వరికుప్పల యాదగిరి రాసిన ఈ పాటను తానే పాడాలని టీంలో అందరూ గట్టిగా పట్టుబట్టడంతో పాడానని, లిరిక్స్ చాలా సులభంగా ఉన్నాయని లక్ష్మి చెప్పింది. తాను ఈ లిరిక్స్ను సంగీతదర్శకుడు రఘు కుంచెకు పంపగా.. ఆయన కూడా తనను ప్రోత్సహించారని, తాను పాడగలనని ఆయనా నమ్మేశారని తెలిపింది.

వాస్తవానికి లక్ష్మి తండ్రి మోహన్ బాబు ఆమెను గాయనిగా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఆయన కల నెరవేర్చేందుకు ఇప్పుడు గొంతు సవరించుకున్నట్లు తెలుస్తోంది. తాను శాస్త్రీయ సంగీతం నేర్చుకునేటప్పుడు కూడా ఎప్పుడూ హెచ్చుస్థాయి స్వరాలు పాడలేకపోయేదాన్నని, దాంతో అసలు గాయని కాలేనని అనుకున్నానని చెప్పింది. అమెరికా వెళ్లాక గొంతు మార్చుకున్నట్లు తెలిపింది. పాట పాడి, రికార్డు చేసిన విషయాన్ని తన తండ్రికి చెప్పడానికి చాలా సిగ్గు పడ్డానని, ఏదో వినిపించినట్లుగా వినిపిస్తే ఆయనకు చాలా నచ్చిందని సంతోషంగా వివరించింది. వెంటనే రఘు కుంచెకు, విష్ణు, మనోజ్లకు కూడా ఆయన ఫోన్లు చేసి తన ఆనందాన్ని పంచుకున్నారట. వాస్తవానికి 2012లో విడుదలైన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలోని 'డిస్ట్రబ్ చేస్తున్నాడే' పాటను కూడా లక్ష్మితోనే పాడించాలని రఘుకుంచె అప్పట్లో ప్రయత్నించి.. విఫలమయ్యారు. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ ఆమెతో పాడించానని, ఈ పాటలో ఆమెతో మరీ హెచ్చుస్థాయి స్వరాలు కూడా పలికించలేదని రఘు చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement