సాక్షి, సినిమా : దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరోసారి తన శైలిని ప్రదర్శించారు. నవంబర్ 20న ఉదయం 10 గం. 30 ని. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జునతో తీయబోయే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందంటూ ఫేస్ బుక్లో ఓ సందేశం ఉంచారు.
శివ ఓపెనింగ్ రోజు తన తండ్రి, నాగ్ తండ్రి నాగేశ్వరరావు హాజరయ్యారని.. కానీ, ఇప్పుడు కొత్త చిత్రం కోసం తన తల్లి, నాగ్ సోదరుడు అక్కినేని వెంకట్, మరో నిర్మాత యార్లగడ్డ సురేంద్ర హాజరవుతారన్నారు. ఆపై ప్రతీ 3 దశాబ్దాలకోకసారి తానూ ఎమోషనల్, సెంటిమెంట్ అవుతానని చెప్పారు. ఇక ఆ తర్వాతే అసలు వ్యవహారం మొదలైంది. నంది అవార్డుల ప్రకటనపై తన అసంతృప్తిని వెల్లగక్కిన వర్మ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
కాసేపటికి నంది అవార్డులపై సెటైరిక్గా నంది విగ్రహం పాడిన పాట... అంటూ చేసిన ఓ పోస్ట్ హిల్లేరియస్గా పేలింది. ఎన్టీఆర్.. ఏఎన్నార్ ప్రధాన పాత్రలో వచ్చిన చాణక్య చంద్రగుప్త సినిమాలోని ఒకటా.. రెండా... తొమ్మిది... మరి ఒకతే తకతై చిన్నది... అని సినారె రాసిన పాట సాహిత్యాన్ని వర్మ టోటల్ గా మార్చిపడేశాడు. ఒకటా.. రెండా... తొమ్మిది... మరి ఒకటే నేనూ నందిని... అంటూ కొత్త వర్షన్ రూపొందించాడు. సైకిల్, కమ్మది, పచ్చ జెండా వంటి కొన్ని పదాలను వాడి నంది అవార్డుల కమిటీ, దాని వెనుక పెద్ద తలకాయలను ఏకీపడేశాడు. అవార్డుల విషయంలో అంతా మా ఇష్టమని కమిటీ సభ్యులు(రాజబాబు, పద్మనాభం, రావుగోపాలరావు...) అంటుంటే, నందిగా జయ మాలిని తన గోడును చెప్పుకోవటం... ప్రస్తుతం ఈ వర్మ వర్షన్ సాంగ్ వైరల్ అవుతోంది.. దానిని మీరూ ఓ లుక్కేయండి.