17న సెలబ్రిటీ క్రికెట్ | Celebrity cricket tamilnadu april 17 | Sakshi
Sakshi News home page

17న సెలబ్రిటీ క్రికెట్

Apr 6 2016 2:59 AM | Updated on Apr 3 2019 8:56 PM

17న సెలబ్రిటీ క్రికెట్ - Sakshi

17న సెలబ్రిటీ క్రికెట్

చెన్నై వాసులకు ముఖ్యంగా సినీ అభిమానులను కనువిందు చేయడానికి,ఆనందోత్సాహాలను కలిగించడానికి తమిళ ఉగాది పండగ

తమిళసినిమా: చెన్నై వాసులకు ముఖ్యంగా సినీ అభిమానులను కనువిందు చేయడానికి,ఆనందోత్సాహాలను కలిగించడానికి తమిళ ఉగాది పండ గ వెంటనే మరో వేడుక జరగనుంది. అదే సెలబ్రిటీ క్రికెట్. సాధారణంగా క్రికెట్ అంటేనే అభిమానులకు ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇక తమ అభిమాన తారలు స్టేడియంలో ఫోర్లు,సిక్సర్లు అంటూ బ్యాట్‌ను ఝుళిపించి బంతులను పరిగెత్తిస్తుంటే ఆ జోషే వేరు. అలాంటి తరుణం ఈ నెల 17న రానుంది.
 
 దక్షిణ భారత నటీనటుల సంఘ భవన నిర్మాణం కోసం నిధిని సేకరించడంలో భాగంగా నిర్వహించనున్న ఈ స్టార్స్ సెలబ్రిటీ క్రికెట్ క్రీడకు చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదిక కానుంది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొననున్న ఈ క్రికెట్ క్రీడను స్టార్ నటులు 8 జట్లుగా ఆడి ఆనందాలను పంచనున్నారు. ఒక్కో జట్టు ఆరు ఓవర్లు ఆడనున్నారు.
 
 ఈ జట్లకు కెప్టెన్ బాధ్యతలను నిర్వహించే వారి వివరాలను సోమవారం ఒక స్టార్ హోటల్‌లో సంఘం నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈ 8 జట్లలో రామ్‌రాజ్ చెన్నై సింగమ్స్ జట్టుకు నటుడు సూర్య, ఎస్థల్ మదురై కాళైస్ జట్టుకు నటుడు విశాల్, శక్తి మసాలా కోవై కింగ్స్‌కు నటుడు కార్తీ, ఎమ్జీఆర్ యూనివర్సిటీ నెల్లై డ్రాగర్స్ జట్టుకు జయంరవి, రామ్‌నాట్ రైనోస్ జట్టుకు విజయ్‌సేతుపతి, తంజై వారియర్స్ జట్టుకు నటుడు జీవా, సేలం చీటర్స్ జట్టుకు నటుడు ఆర్య, కల్యాణ్ జ్యువెలర్ తిరుచ్చి టైగర్స్ జట్టుకు శివకార్తికేయన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు.
 
  ఈ సెలబ్రిటీ క్రికెట్ క్రీడకు సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్ అదనపు ఆకర్షణ కానున్నట్లు ఇంతకు ముందు కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది.అయితే ఆ విషయం గురించి ఇప్పుడు ప్రస్థావించకపోవడం గమనార్హం. సమావేశంలో పలువురు నటీనటులతోపాటు దర్శక,నిర్మాతలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement