మరోసారి హాలీవుడ్‌కు..

Aishwarya Rai Going to Hollywood Soon - Sakshi

సినిమా: అందాలసుందరి ఐశ్వర్యారాయ్‌ మరోసారి హాలీవుడ్‌కు వెళ్లనుందన్నది తాజా సమాచారం. 1994లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీ ముందుగా నటించింది కోలీవుడ్‌లోనే అన్నది గమనార్హం. ఈ అమ్మడిని దర్శకుడు మణిరత్నం కోలీవుడ్‌కు తీసుకొచ్చారన్న విషయం తెలిసిందే. ఆ తరువాత స్టార్‌ దర్శకుడు శంకర్‌ జీన్స్‌ చిత్రంలో నటింపజేశారు. ఆ తరువాత బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఐశ్వర్యారాయ్‌ ఆ మధ్య మరోసారి మణిరత్నం దర్శకత్వంలో రావన్‌ చిత్రంలో నటించింది.

తాజాగా మళ్లీ ఆయన తెరకెక్కించనున్న పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. ఇందులో అమితాబ్‌బచ్చన్, విక్రమ్, కార్తీ, జయంరవి, మోహన్‌బాబు, నయనతార వంటి ప్రముఖ నటీనటులతో కలిసి నటించబోతోంది. అయితే ఈ చిత్రంలో ఐష్‌ ప్రతినాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతభాణీలను అందించనున్న ఈ చిత్రం సెప్టెంబరు నెలలో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. కాగా ప్రస్తుతం తన భర్త అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి గులాబ్‌జామూన్‌ చిత్రంలో నటించింది. ఆ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తాజా సమాచారం ప్రకారం ఐష్‌ హాలీవుడ్‌ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోందట. ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రారంభం అవుతుందని తెలిసింది. ఇప్పటికే బాలీవుడ్‌ బ్యూటీస్‌ ప్రియాంక చోప్రా, దీపిక పడుకొనే, ఐశ్వర్యరాయ్‌లు హాలీవుడ్‌లో నటించారన్నది గమనార్హం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top