
శివాజీనగర (బెంగళూరు): తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, అయితే పదేపదే సవాల్ చేస్తే రాజ కీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమేనని ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ అన్నా రు. ఆదివారం బెంగళూరు ప్రెస్ క్లబ్లో ఆయన ‘ఈ ఏటి (2017) ప్రెస్క్లబ్ వ్యక్తి’ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయం చాలా కష్టం. అందులో ఒక బాధ్యత ఉంటుంది. అందుకే నేను దూరంగా ఉంటాను. పదేపదే సవాల్ చేస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం’ అని పేర్కొన్నారు.
జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యోదంతం తనలో మార్పు తీసుకొచ్చిందని తెలిపారు. సమాజంలో జరుగుతున్న దారుణాలపై గళమెత్తాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సీనియర్ పాత్రికేయులే తనకు ప్రశ్నించే ధైర్యాన్నిచ్చారని, వారి మార్గదర్శకత్వంలో పెరిగిన ఏకలవ్య శిష్యుడినని చెప్పారు. సమాజంలో బాధ్యతగా మాట్లాడేందుకు ప్రెస్క్లబ్ అందించిన పురస్కారం మరింత ధైర్యాన్ని ఇచ్చిందని
అన్నారు.