బట్టబయలైన పాక్‌ కుట్ర... నిజాలు కక్కిన ఉగ్రవాది! | Sakshi
Sakshi News home page

బయటపడ్డ పాక్‌ కుట్ర... నిజాలు కక్కిన ఉగ్రవాది!

Published Fri, Apr 17 2020 4:56 PM

Report Says Pakistan Reactivates Taliban Terror Camps To Attack Kashmir - Sakshi

కాబూల్‌/న్యూఢిల్లీ: ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు మల్లగుల్లాలు పడుతుంటే పాకిస్తాన్‌ మాత్రం ఇవేమీ పట్టకుండా మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఆరోగ్య సంక్షోభం తలెత్తిన వేళ ఉగ్ర దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నింది. ఆఫ్గనిస్తాన్‌- పాకిస్తాన్‌ సరిహద్దుల వెంబడి తాలిబన్‌ గ్రూపులను పునరుత్తేజపరిచి కశ్మీర్‌పై దాడికి వ్యూహాలు రచించింది. జైషే ఉగ్రవాదులతో కలిసి పనిచేయాల్సిందిగా తాలిబన్లను ఆదేశించిన దాయాది దేశం.. ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న భారత ఆస్తులను ధ్వంసం చేసేలా కుట్ర పన్నింది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ఆఫ్గన్‌ భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఎత్తుగడను చిత్తు చేశాయి. (పాకిస్తాన్‌ తీరుపై మండిపడ్డ భారత ఆర్మీ చీఫ్‌)

ఈ క్రమంలో జైషే, తాలిబన్‌ ఉగ్రవాదులపై కాల్పులు జరిపి.. 15 మందిని మట్టుబెట్టారు. వీరిలో ఏడుగురు జైషే సంస్థకు చెందిన వారు కాగా ఎనిమిది మంది తాలిబన్‌ గ్రూపునకు చెందినవారు. ఇక వీరిని హతమార్చిన అనంతరం భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అఫ్గన్‌ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో వీరి చేతికి చిక్కిన ఓ ఉగ్రవాది తమ ప్రణాళిక గురించి వారికి వివరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ‘‘ఏప్రిల్‌ 13- 14 అర్ధరాత్రి సమయంలో జైషే ఉగ్రవాదులు నంగర్హర్‌ ప్రావిన్స్‌లో చొరబడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురిని హతమార్చారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు’’అని ఆఫ్గాన్‌ మీడియా ఈ మేరకు కథనం వెలువరించింది.  (అప్గనిస్తాన్‌: ఏడుగురు పౌరుల ఊచకోత!)

ఇక ఈ విషయం గురించి భారత సైన్యానికి చెందిన అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాక్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని తాము ముందే ఊహించామన్నారు. ‘‘ఐఎస్‌ఐ పాత ఆట మళ్లీ మొదలుపెట్టింది. గతంలో అఫ్గన్‌ లోపలి నుంచే కుట్రలు పన్నేది. అయితే అమెరికాతో ఒప్పందం తర్వాత వారి పంథా మారినట్లు వెల్లడించింది. ఇదంతా కేవలం అమెరికన్లను ప్రసన్నం చేసుకునేందుకే.. కానీ వారి తీరు మారలేదు. అయితే ఆఫ్గన్‌ రక్షణ దళాలు వారి ఆట కట్టించేందుకు దృఢ సంకల్పంతో యుద్ధం చేయడం ఊహించని పరిణామం. ఏదేమైనా వాళ్లు గొప్ప పని చేశారు’’అని పేర్కొన్నారు.

కాగా  దశాబ్దకాలంగా అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అగ్రరాజ్యం అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న పాక్‌ మరోసారి కుట్రలకు తెరతీసింది.(తాలిబన్ల విడుదలకు అధ్యక్షుడి ఆదేశాలు)

Advertisement
Advertisement