జంతువులు కూడా ‘సామాజిక దూరం’ | Corona Virus: Social Distancing Is In Animals Also | Sakshi
Sakshi News home page

జంతువులు కూడా ‘సామాజిక దూరం’

Apr 10 2020 4:49 PM | Updated on Apr 10 2020 6:29 PM

Corona Virus: Social Distancing Is In Animals Also - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ బారిన పడకుండా తప్పించుకునేందుకు మనమంతా లాక్‌డౌన్‌  పేరిట సామాజిక దూరం పాటిస్తున్నాం. వైరస్‌ లాంటి మహమ్మారిలు దాడి చేసినప్పుడు మనుషులే కాదు, కొన్ని యుగాలుగా జంతువులు కూడా సామాజిక దూరం పాటిస్తున్నాయి. కోతులు, సముద్ర పీతలు, క్రిములు , చీమలు, పక్షులు ఇలా సామాజిక దూరాన్ని పాటిస్తాయని వర్జీనియాలో బయోలాజికల్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న దానా హావ్లీ తెలిపారు. అయితే మనుషులు పాటించే సామాజిక దూరానికి జంతువులు, పక్షులు పాటించే సామాజిక దూరం కాస్తా భిన్నంగా ఉంటుందని, అవి ఎక్కువగా తమ ప్రవర్తన ద్వారా సామాజిక దూరాన్ని పాటిస్తాయని చెప్పారు. ('వ్యాక్సిన్ తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నాయి')

గుంపులుగా జీవనం సాగించే చీమలు, కోతులు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తాయంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. పలు రకాల చీమలు చిన్న చిన్న గదుల్లో వందలు, వేలు కలసి జీవిస్తాయి. చీమల్లో జబ్బు పడిన చీమ తనంతట తానే స్వచ్ఛందంగా ఏకాంతంలోకి వెళుతుంది. మిగతా చీమలు కూడా తమ తోటి చీమలతో సంబంధాలను వీలైన మేరకు తగ్గించుకుంటాయి. ‘మాండ్రిల్స్‌’ లాంటి కోతి జాతిలో జబ్బు పడిన కుటుంబ సభ్యులకు మాత్రమే కోతులు సేవ చేస్తాయి. ఇతర కుటుంబ సభ్యులకు సేవ చేయవు. పైగా ఆ సమయంలో ఇతర కోతులతో అవి సామాజిక దూరాన్ని పాటిస్తాయి. (కరోనా: ‘మర్కజ్, నిజాముద్దీన్ అని చెప్పొద్దు)

ఇక పిశాచ గబ్బిలాలు తమలో జబ్బు పడిన గబ్బిలాలకు తమ, పర అన్న తేడా లేకుండా  ఆహారాన్ని అందిస్తాయి. అయితే వాటికి సమీపంలో మసలడం, చుట్టూ తిరగడం, పక్కనే వేలాడడం చేయవు. సముద్ర జలాల్లో ఉండే ‘పనులిరస్‌ ఆర్గస్‌ వైరస్‌ (పీఏవీ1)’ భౌతిక కలయిక ద్వారా ఒక సముద్ర పీత నుంచి మరో పీతకు వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకిన పీతల్లో 60 శాతం పీతలు 80 రోజుల్లో మరణిస్తాయి. ఆ సమయంలో జబ్బు పడిన పీతల వద్దకు ఇతర పీతలు వెళ్లకుండా సామాజిక దూరాన్ని పాటిస్తాయి. (కోవిడ్ ప్రొటెక్షన్ రైళ్లలో..)

మనుషులకు కూడా సామాజిక దూరం పాటించడం మన పూర్వుల నుంచి అబ్బిందని వైద్యులు చెబుతుండగా,  మానవ అవతార పరిణామా క్రమంలో జంతువుల నుంచే సంక్రమించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గబ్బిలాల వలనే జబ్బు పడిన వారిని లేదా ఆకలితో అలమటిస్తున్న ఇతరులను ఆదుకునే నైజం మానవుడికి కూడా అబ్బింది. అందరిని ఆదుకోలేక పోయినా చాలా మంది ఇరుగు, పొరుగు వారినో, స్నేహితులతో ఆదుకుంటారు. భౌతిక స్మర్శ లేకుండా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంతోపాటు అనుబంధాలను కొనసాగించే అవకాశం జంతువులకు లేదు, మనుషులకు మాత్రమే ఉంది. అలాంటప్పుడు వైరస్‌లు విజృంభించినప్పుడు మానవుడే చిత్తశుద్ధితో సామాజిక దూరాన్ని పాటించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మానవుడు సంఘజీవి. ఎక్కువ కాలం సామాజిక దూరం పాటించలేరనే వాదన కూడా ఉంది. అయితే నేడు ఎంతమంది సంఘం స్ఫూర్తితో బతుకుతున్నారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. (కరోనా కాలం: చెట్టుపైనే మకాం!)

Advertisement
 
Advertisement
Advertisement