
'ప్రభుత్వ విధానాలతో విసిగిపోయా'
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయి.. అవార్డులను తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రముఖ రచయిత, నటుడు ఎం. భూపాల్ రెడ్డి తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయి.. అవార్డులను తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రముఖ రచయిత, నటుడు ఎం. భూపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన రాష్ట్ర సర్కారు అందజేసిన ఉగాది పురస్కారం -2015 వెనక్కి ఇచ్చేశారు. రవీంద్రభారతి ప్రాంగణంలోని భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ అమృత చేతికి ఉగాది పురస్కారాన్ని, రూ. 10 వేల నగదును అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సర్కారు తీరుపై విస్మయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని, విద్యార్థులు ఉద్యోగాల్లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారం చేపట్టిన ఏడాదిన్నరకే బూటకపు ఎన్కౌంటర్లకు ప్రభుత్వం తెరలేపిందన్నారు. శ్రుతిని హింసించి చంపడం బాధాకరమన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉగాది నాడు తనకిచ్చిన ఉగాది పురస్కారాన్ని వెనక్కు ఇచ్చేశానని చెప్పారు. బుద్ధి తక్కువై నాడు అవార్డు తీసుకున్నానని వాపోయారు. త్వరలోనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా తిరిగి ఇచ్చేయనున్నట్లు చెప్పారు. బతుకమ్మ, ఆధ్యాత్మిక కార్యక్రమాలే అభివృద్ధి కాదని.. రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులను కూడా పాలకులు పట్టించుకోవాలని అన్నారు.