స్వార్థపరుల ప్రయోజనం కోసమే రాష్ర్ట విభజన | The division of the state for the benefit of selfish | Sakshi
Sakshi News home page

స్వార్థపరుల ప్రయోజనం కోసమే రాష్ర్ట విభజన

Mar 23 2015 2:05 AM | Updated on Mar 23 2019 9:03 PM

ఆత్మీయ అనుబంధాలను గుర్తు చేస్తున్న పండుగ.. గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సాంప్రదాయం మనది. కష్ట సుఖాలను జీవితంలో చవిచూడాలి.

కలెక్టరెట్: ఆత్మీయ అనుబంధాలను గుర్తు చేస్తున్న పండుగ.. గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సాంప్రదాయం మనది. కష్ట సుఖాలను జీవితంలో చవిచూడాలి. మాధుర్యం, షడ్రుచుల ఉగాది పచ్చడి తెలియ చెప్పే నిజం అదేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రెవె న్యూశాఖ మంత్రి కే.ఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో ఢిల్లీ తెలుగు అకాడమీ అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ 27వ ఉగాది వేడుకలు, 2015 పురస్కారాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూ ఇండియా ఎస్యూరెన్సు, ఇండియన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఆయిల్, కరూర్ వైశ్యా బ్యాంక్, హెచ్‌యూడీసీఓ, ఎన్‌ఎండీసీ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందిచాయి.

ఈ సందర్భంగా ప్రముఖులకు ఉగాది పురస్కారాలు (ఉద్యోగ రత్న), అవార్డులు అందజేశారు. అవార్డు పొందిన వారిలో  ఎన్‌ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారి, ఐఎఎస్‌లు దాసరి శ్రీనివాస్‌లు, కేఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి, ఐటీఐఎల్ సీఎండీ కే.ఎల్ డింగ్ర, మెట్రో ఇండియా సీఎండీ సీఎల్ రాజం, ఎస్బీహెచ్ ఎండీ సంతను ముఖర్జీ, దూరదర్శన్ డెరైక్టర్ శైలజా సుమన్, కరూర్ వైశ్యా బ్యాంక్ సీనియర్ అధికారి కె.వెంకటేశ్వర్లు తదితరులను డిప్యూటీ సీఎం, సినారేలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంటింటా తెలుగు ఆటాపాటా కొనసాగాలని, ప్రతి నోటా తెలుగు వినిపించాలని, ప్రతి ఒక్కరూ తెలుగును అనుసరించాలని ఆకాంక్షించారు.

ఎన్ని దేశాలు మారిన ఎలా విడిపోయినా తెలుగు సంస్కృతి, తెలుగు భాషను మరువద్దన్నారు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన తెలుగువారిని కొందరు స్వార్థపరులు స్వలాభాల కోసం విడదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎందుకు చేశారో కానీ ఈ రోజు తెలుగువారంతా బాధపడాల్సి వస్తుందన్నారు. ఈ ఉగాది నూతన కొంతమందికి ఆనందంగా ఉంటుందని, కానీ కొంతమందికి విభజన చేదు అనుభవంగా మిగిలిందన్నారు. కలిసి పనిచేసి మంచి ఫలితాలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత సి.నారాయణరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మోహన్‌కందా, ఐఏఎస్‌లు ఎన్.గోపాలకృష్ణ, బీవీ రామారావు, ఆర్‌ఎస్‌జీ రావు, డాక్టర్ జె. చెన్నయ్య, డాక్టర్ ఎన్‌వీఎల్ నాగరాజు, చొక్కాపు వెంటరమణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement