ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం | That law is unconstitutional | Sakshi
Sakshi News home page

ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం

Jun 8 2017 3:02 AM | Updated on Aug 10 2018 8:26 PM

ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం - Sakshi

ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం

పశుమాంస నిషేధచట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు.

- సీపీఐ నేత సురవరం
- కేంద్రం పరిధి దాటుతున్నా టీడీపీ, టీఆర్‌ఎస్‌ మౌనమెందుకు?
 
సాక్షి, హైదరాబాద్‌: పశుమాంస నిషేధచట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు బినయ్‌ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి బుధవారం ఆయన మఖ్దూంభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం తన పరిధిని దాటి ఉమ్మడి అధికారాల జాబితాలోని అంశాల్లో జోక్యం చేసుకుంటున్నా టీఆర్‌ఎస్, టీడీపీ ప్రభుత్వాలు ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. మాంసాహార నిషేధంపై బీజేపీ చేస్తున్న వాదన మోసపూరిత మైందని వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి వెంకయ్య తాను మాంసాహారిని అని అంటుంటే, మరో బీజేపీ నేత ఇంద్రేశ్‌ కుమార్‌ మాంసాహారం వ్యాధి కారకమని అంటున్నారన్నారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకంలో శాఖాహారమే ఇవ్వాలన్న బీజేపీ ప్రకటనలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు జరపడం దారుణమన్నారు. బాధ్యులైన పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మియాపూర్‌ భూ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వ తాత్సారం అనుమానాలకు తావిస్తోందని, ఈ కుంభకోణంలో మంత్రుల కార్యాలయాల్లో ఉన్నవారిపైనే ఆరోపణలు వస్తున్నందున సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సాదా బైనామాలపై సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని అమలు చేయడంలేదని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement