ఎంసెట్-2 రద్దుకే ప్రభుత్వం మొగ్గు? | Telangana government mulling over cancellation of eamcet medical exam | Sakshi
Sakshi News home page

ఎంసెట్-2 రద్దుకే ప్రభుత్వం మొగ్గు?

Jul 26 2016 5:24 PM | Updated on Oct 9 2018 7:52 PM

తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ -2 పేపర్ లీకేజి వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఇద్దరు బ్రోకర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ -2 పేపర్ లీకేజి వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఇద్దరు బ్రోకర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లను కూడా విచారించినట్లు తెలుస్తోంది. కొందరు కన్సల‍్టెన్సీల బ్రోకర్ల కోసం గాలింపు జరుపుతున్నారు. ఈ కేసు విచారణ కోసం హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, విజయవాడ, కనిగిరి తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. సీఐడీ ప్రత్యేక బృందాలు వెళ్లి గాలింపులు జరుపుతున్నాయి. ఇప్పటికే నలుగురు విద్యార్థులను విచారించిన సీఐడీ అధికారులు.. మరో 60 మంది వరకు విద్యార్థులను విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటం.. వైద్య విద్యకు సంబంధించిన క్లాసులను కూడా ప్రారంభించాల్సి రావడంతో వీలైనంత త్వరగా ఈ పరీక్ష విషయమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎంసెట్ మెడికల్ పరీక్షను రద్దు చేయడానికే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ఎంసెట్లో వేలల్లో ర్యాంకులు వచ్చిన కొంతమంది విద్యార్థులకు తెలంగాణ ఎంసెట్లో మాత్రం వందల్లోనే ర్యాంకులు రావడంతో ముందుగా కొంతమంది తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విచారణ జరిపిస్తామని మంత్రి హామీ ఇచ్చినా ఆ తల్లిదండ్రులు మాత్రం తమ ఆందోళనను ఆపలేదు. గట్టిగా ఒత్తిడి తేవడంతో.. ముందుగా ప్రాథమిక విచారణ జరిపిన అధికారులకు ఇందులో ఏదో మతలబు ఉన్న విషయం అర్థమైంది. దాంతో.. గట్టిగా ఆరా తీయగా, గుట్టు మొత్తం క్రమంగా బయటపడటం మొదలైంది. ముంబై, కనిగిరి, బెంగళూరు తదితర ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. వీటికి డీఎస్పీ స్థాయి అధికారులు నేతృత్వం వహించారు. కనిగిరిలో కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారుల కాల్ లిస్టులతో పాటు, విద్యార్థులు, కోచింగ్ సెంటర్ల యజమానుల కాల్ లిస్టులను కూడా సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులపై అనుమానం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోయినా.. కీలక విషయాలను మాత్రం రాబట్టినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం సెర్చి వారంటు కోసం నాంపల్లి కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలుచేసింది. ఆరోపణలు చేసిన తల్లిదండ్రుల నుంచే అసలు సమాచారం అంతా వచ్చినట్లు తెలిసింది. దాంతో అవసరమైతే వాళ్లను కూడా పిలిచి విచారించాలని ఆలోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement