ఆ ఎమ్మెల్యే జైలుకూడు తినకతప్పదు

ఆ ఎమ్మెల్యే జైలుకూడు తినకతప్పదు - Sakshi


హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిల మధ్య వివాదం ముదిరింది. మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని మంచిరెడ్డి కిషన్రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే అనుచరులతో వచ్చి ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బైఠాయించారు. ఈ వ్యాఖ్యలపై మల్రెడ్డి స్పందిస్తూ.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.



'మంచిరెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఓ గ్యాంగ్స్టర్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నయీంతో ఆయనకు ఏడెనిమిది సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. దమ్ముంటే నయీంతో కలసి చేసిన దందాల మీద మాట్లాడాలి. మంచిరెడ్డి పేదల దగ్గర నుంచి భూములు లాక్కొన్నారు. ఏడేళ్ల నుంచి ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో నా దగ్గర ఆధారాలున్నాయి. మంచిరెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అధికార టీఆర్ఎస్లోకి వెళ్లారు. పేదల రక్తాన్ని పీల్చి వందల కోట్ల రూపాయలు సంపాదించారు. నయీం కేసులో సంబంధాలున్నవారిని అరెస్ట్ చేసినట్టే మంచిరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన దళిత కుటుంబాలను మోసం చేశాడు. నా దగ్గర ఆధారాలున్నాయి. మంచిరెడ్డి దొరికిన దొంగ, తప్పించుకోలేరు. జైలు కూడు తినకతప్పదు' అని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top