ప్రముఖ వైద్యుడు ఏకే చారి కన్నుమూత

ప్రముఖ వైద్యుడు ఏకే చారి కన్నుమూత


 హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ అచ్చి కృష్ణాచారి(87) గుండెపోటుతో బుధవారం కన్ను మూశారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ రోడ్‌లో నివాసముండే ఆయన కొంత కాలంగా హృద్రోగంతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో మృతిచెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఏకే చారి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయడంతో పాటు పాథాలజీ సర్జరీలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ధూల్‌పేట్ ప్రాంతంలో వైద్య వృత్తిని ఆరంభించారు. గాంధీ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.



కర్నూల్ మెడికల్ కళాశాలలో సర్జరీ ప్రొఫెసర్‌గా, గాంధీ ఆస్పత్రిలో సర్జరీ విభాగం హెచ్‌వోడీగా, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించి 1983లో గాంధీ ఆస్పత్రిలో పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆయన వైద్య సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రతినిధిగా రష్యా, యూకే, యూఎస్‌ఏలలో కూడా పర్యటించారు. గురువారం బన్సీలాల్‌పేటలోని  శ్మశానవాటికలో ఏకే చారి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఏకే చారి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top