ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.
ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన హుస్సేనీఆలం పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎ. బాలాజి కథనం ప్రకారం.. గురునానక్ ఇన్స్టిట్యూషన్ టెక్నికల్స్ క్యాంపస్ కళాశాల బస్సు (ఏపీ 09ఎక్స్ 7555) కిషన్బాగ్లో ఫంక్షన్కని సిటీ కళాశాల నుంచి వస్తోంది. సాయంత్రం 5.30 గంటలకు పురానాపూల్ చౌరస్తాలోని గుడ్విల్ హోటల్ వద్దకు రాగానే బ్రేక్లు ఫెయిల్ కావడంతో అక్కడే ఉన్న సాయిబాబా మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది.
దీంతో ఆ సమయంలో షాపు వద్ద ఉన్న కామాటిపురా మురళీనగర్ ప్రాంతానికి చెందిన శివకళాబాయి (60) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ధూల్పేట్ ప్రాంతానికి చెందిన ప్రేమాబాయి (60), అదే సమయంలో అటు ద్విచక్రవాహనంపై వెళుతున్న ఉస్మాన్బాగ్ ప్రాంతానికి చెందిన బషీర్ (32) కూడా తీవ్రంగా గాయపడ్డారు. బషీర్ బైక్తో పాటు మెడికల్ షాపు కూడా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శివకళాభాయి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.