క్షమ నక్షత్రం | Birth of Christ's kindness bestowed upon mankind. | Sakshi
Sakshi News home page

క్షమ నక్షత్రం

Dec 24 2014 10:55 PM | Updated on Sep 2 2017 6:41 PM

చీకటితో, పాపంతో, భయంతో మనిషి చేసిన స్నేహానికి ఫలితంగా అతడనుభవించిన ఓటములకు, చేదు అనుభవాలకు క్రిస్మస్‌తో తెరపడింది. క్రీస్తు జననం మానవాళికి క్షమను ప్రసాదించింది.

చీకటితో, పాపంతో, భయంతో మనిషి చేసిన స్నేహానికి ఫలితంగా అతడనుభవించిన ఓటములకు, చేదు అనుభవాలకు క్రిస్మస్‌తో తెరపడింది.  క్రీస్తు జననం మానవాళికి క్షమను ప్రసాదించింది.
 
కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం తీయడమనే పైశాచిక న్యాయంతో అట్టుడుకుతున్న లోకానికి క్షమాపణ, ప్రేమ అనే కొత్త సూత్రాలను నేర్పిన మహా ప్రబోధకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు ‘ఇమ్మానుయేల్’.. అంటే దేవుడు మనకు తోడు అనే అర్థాన్నిచ్నే పేరు కూడా ఉంది. దేవుడు మనకెప్పుడూ తోడుగానే ఉంటాడు కదా, మరి ప్రత్యేకమైన ఆ పేరును ఆయనకెందుకిచ్చారు? దేవుడు సర్వాంతర్యామి. కాని మనం ఆయనతో ఉన్నామా లేదా అన్నదే ప్రధానాంశం. ఒక తండ్రి తన కొడుకు చేతిని తన చేతితో పట్టుకుని నడుస్తూంటే వాడు తప్పిపోయే ప్రమాదం లేదు. తండ్రి చేతిని కొడుకు పట్టుకుని నడిచే పరిస్థితుల్లో బజార్లో కనిపించే ఆకర్షణలు, ప్రలోభాలకు లొంగి వాడు ఏదో ఒక చోట తండ్రి చేతిని వదిలి వెళ్ళి తప్పిపోయే ప్రమాదం ఉంది కదా! కొడుకు తండ్రి చేతిని పట్టుకుని నడవటం కాదు, తొలి క్రిస్మస్ తర్వాత తండ్రిగా దేవుడే మానవాళి చేయిపట్టుకుని తప్పిపోకుండా క్షేమంగా నడిపించే రోజులు ఆరంభం అయ్యాయని చెప్పడమే ఇమ్మానుయేలు అనే మాటలోని అంతరార్థం. చీకటిలో, కష్టాల్లో, కన్నీళ్లల్లో, ఓటమిలో బలహీనతల్లో, పడిపోయిన స్థితిలో, భయాల్లో ఇలా అన్ని పరిస్థితుల్లోనూ మానవాళికి దేవుడు ఇమ్మానుయేలు.

దేవుడున్నాడనే అంతా నమ్ముతారు కానీ క్రిస్మస్‌తో దేవుడు ‘నేను నిజంగా ఉన్నాను’ అంటూ మానవాళికి రుజువులిస్తూ ఈ లోకాని వేంచేశాడు. సంతృప్తి, శాంతి, ప్రేమ, క్షమాపణ, పరస్పర గౌరవాలు ఆరంభమైన మానవాళి ఆత్మీయ ప్రయాణానికి తొలి అడుగు క్రిస్మస్. ఇందులో మజిలీతోపాటు ప్రయాణమూ ఆనందభరితమే! ‘నిన్నువలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు’ అన్న అద్భుతమైన ప్రేమసూత్రాన్నిచ్చిన యేసుక్రీస్తు మానవాళిని ప్రేమించి ఈ లోకానికి రావడం ద్వారా ఆ ప్రేమ సామ్రాజ్యానికి పునాది వేసిన శుభదినం క్రిస్మస్.

‘అందర్నీ ప్రేమించు’ అని సూత్రీకరించడం అంతటా వింటున్నాం. కానీ ఎంతగా ప్రేమించాలో, ఎలా ప్రేమించాలో చరిత్రలో ఎవరూ వివరించలేదు. అదొక భక్తి సూత్రంగా ఉన్న కారణంగానే వైషమ్యాలు, కక్షలు పగలూ పెచ్చరిల్లి చరిత్రలో మనిషికి మనిషే ప్రధాన శత్రువయ్యాడు. ఆ దశలోనే యేసుక్రీస్తు మనల్ని మనం ప్రేమించుకున్నంతగా అవతలి వ్యక్తిని ప్రేమించాలంటూ ప్రబోధించడమేగాక అంతటి ప్రేమనూ తన జీవితం ద్వారా మానవాళికి చూపించే ప్రేమ పరిధిని విస్తృతం చేశాడు. ఆ పరిధిలోకి దేవుడై ఉండీ ఆయన మానవుడుగా తానే ఇమిడిపోయాడు. అదే క్రిస్మస్ గుర్తు చేసే ప్రేమపాఠం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement