
ప్రతి విద్యార్థికీ వైద్యం
ఆగస్టు నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ హెల్త్ చెకప్లు పూర్తిచేస్తాం.
♦ రెండు నెలల్లో అందుబాటులోకి వైద్యపరీక్షలు
♦ ఆర్బీఎస్కే కింద ప్రత్యేక వైద్య బృందాలు
♦ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా సేవలు
♦ ఎరువులు, విత్తనాల కొరత రానివ్వం
ఆగస్టు నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ హెల్త్ చెకప్లు పూర్తి చే స్తాం. విద్యార్థి సమగ్ర ఆరోగ్య నివేదికను రూపొందిస్తాం. ఖరీఫ్కు సరిపడా విత్తనాలు, ఎరువులను నిల్వ చేశాం. 25వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరమవుతాయని ప్రణాళిక రూపొందించాం.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘వైద్య సేవలను విద్యార్థుల ముంగిట్లోకి తెస్తున్నాం. రెండు నెలల్లో ప్రతి విద్యార్థికి సంపూర్ణ వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం’ కింద నిపుణులైన వైద్య బృందాలను అందుబాటులోకి తెచ్చాం’ అని కలె క్టర్ ఎం.రఘునందన్రావు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ప్రతి విద్యార్థిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు
ప్రతి విద్యార్థికి వైద్యపరీక్షలు నిర్వహించాలనే నిబంధన చాలాకాలంగా ఉంది. తగినంత మంది వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఇది అమలు కాలేదు. తాజాగా కేంద్ర సర్కారు ఆర్బీఎస్కేను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించింది. జిల్లాలోని 11 క్లస్టర్లకు ఈ బృందాలను అందుబాటులోకి తెచ్చాం. నలుగురితో కూడిన ఈ బృందంలో ఒక వైద్యుడు, ఒక వైద్యురాలు సహా ఏఎన్ఎం, ఫార్మసిస్టు ఉంటారు. ఈ టీమ్ విధిగా తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి వైద్యపరీక్షలు నిర్వహించాలి.
విద్యార్థులకు ‘హెల్త్’కార్డులు
లోపాలు, ఎదుగుదల, వైకల్యం, వ్యాధి లక్షణాలను బాల్యంలోనే గుర్తించడం ద్వారా రోగాలను అరికట్టవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనికి అనుగుణంగా 0- 18 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నాం. ఆగస్టు నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ హెల్త్ చెకప్లను పూర్తి చే స్తాం. పౌష్టికాహారలోపం, వయస్సుకు తగ్గట్టుగా శరీరభాగాలు ఎదగకపోవడం, ఇతర వైకల్యాలతోపాటు దంత పరీక్షలను నిర్వహించి విద్యార్థి సమగ్ర ఆరోగ్య నివేదికను రూపొందిస్తాం. వైద్య పరీక్షల్లో ఏవైనా వ్యాధి లక్షణాలు, ఇత ర రుగ్మతలు కనిపిస్తే.. ఇతర పరీక్షలకు జిల్లాస్థాయిలో పనిచేసే వైద్య నిపుణులకు సిఫార్సు చేస్తారు. కొండాపూర్ లేదా తాండూరులో ఉండే ఈ వైద్య బృందంలో 13 మంది నిష్ణాతులైన డాక్టర్లు ఉంటారు. వీరి పర్యవేక్షణలో విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలందుతాయి.
సమృద్ధిగా విత్తనాలు
ఖరీఫ్కు సరిపడా విత్తనాలు, ఎరువులను నిల్వ చేశాం. 25వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరమవుతాయని ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే 10వేల మెట్రిక్ టన్నుల స్టాకు మండల కేంద్రాలు, అన్ని పీఏసీఎస్లలో సిద్ధంగా ఉంది. రైతులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తొలిసారి విత్తనాలు, ఎరువులను వ్యవసాయ సహకారసంఘాల ద్వారా విక్రయిస్తున్నాం. వర్షాలు బాగా కురుస్తాయనే వాతావరణ శాస్త్రవేత్తల ప్రకటనతో పెరిగే సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నాం.