రగడ! | ragada | Sakshi
Sakshi News home page

రగడ!

Jun 6 2017 12:29 AM | Updated on Aug 10 2018 8:26 PM

రగడ! - Sakshi

రగడ!

అధికార తెలుగుదేశం పార్టీలో కమిటీల వార్‌ మొదలయ్యింది. పార్టీ కమిటీల్లో తమ మనుషులు ఉండాలంటూ పాత–కొత్త నేతలు వాగ్వాదానికి దిగుతున్నారు

- టీడీపీలో కమిటీల వార్‌ 
- పాత–కొత్త నేతల మధ్య కుదరని సయోధ్య
- తమ మనుషులే ఉండాలంటూ పట్టు
- ఐదు నియోజకవర్గాల్లో సమస్య
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు:  అధికార తెలుగుదేశం పార్టీలో కమిటీల వార్‌ మొదలయ్యింది. పార్టీ కమిటీల్లో తమ మనుషులు ఉండాలంటూ  పాత–కొత్త నేతలు వాగ్వాదానికి దిగుతున్నారు. జిల్లా మినీ మహానాడు నిర్వహణ తర్వాత... నియోజకవర్గస్థాయి కమిటీల ఏర్పాటుపై నేతలు దృష్టి సారించారు. అయితే, గతంలో ఉన్న నేతలు, కొత్తగా గోడదూకి పార్టీలోకి వచ్చిన నేతల మధ్య ప్రధానంగా గొడవ నడుస్తోంది. నందికొట్కూరు, శ్రీశైలం, కోడుమూరు, నంద్యాల, కర్నూలు నియోజకవర్గాల్లో ప్రధానంగా గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. తమ మనుషులే కమిటీలో ఉండాలంటూ ఎవరికివారుగా పార్టీ అధిష్టానానికి ప్రతిపాదనలు సమర్పించారు. కేవలం తన అనుచరులతోనే కమిటీలు వేయించుకోవాలని ఎవరికివారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత–కొత్త నేతల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పొడచూపుతున్నాయి. 
 
అవమానిస్తూ...!
కేవలం తమ మనుషులే పార్టీ కమిటీలో ఉండేలా చూసుకునేందుకు ఎవరికివారుగా ప్రయత్నిస్తూనే.. అవతలి నేతల అనుచరులను అవమానించే రీతిలో వైరి వర్గం నేతలు వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో పూర్తిగా తన నేతలకే పగ్గాలు అప్పగిస్తూ... వైరివర్గంలోని నేతల పేర్లను చిన్న చిన్న పోస్టులు అప్పగిస్తూ ఇరువురు నేతలు ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిసింది. ఇక కర్నూలులోనూ ఎమ్మెల్యే పూర్తిగా తన మనుషులకే పోస్టులు అప్పగిస్తూ... టీజీ మనుషులను బూత్‌స్థాఁఇ కమిటీలల్లో పేర్కొంటూ ప్రతిపాదనలు సమర్పించినట్టు సమాచారం. ఇక నందికొట్కూరులో మాండ్ర శివానందరెడ్డి వర్గీయులను పూర్తిగా పక్కకు నెట్టి... శిల్పా చక్రపాణి రెడ్డి రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కూడా ఈ మధ్యకాలంలో కార్యరంగంలోకి మళ్లీ దిగారు. ఇక కోడుమూరులో ఎమ్మెల్యే మణిగాంధీ, ఇన్‌చార్జీ విష్ణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.  కమిటీల ఏర్పాటు ప్రక్రియలోనూ ఇదే విధంగా ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారు. నంద్యాలలోనూ భూమా వర్సెస్‌ శిల్పా రాజకీయం.. కమిటీల ఏర్పాటులోనూ నడుస్తోంది. అయితే, ఎదుటిపక్షానికి చెందిన నేతల పేర్లను కనీసం పేర్కొనకపోవడం...ఒకవేళ పేర్కొన్నప్పటికీ కిందిస్థాయి పోస్టులల్లో ప్రతిపాదించడం ద్వారా అవమానిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఏ వర్గానికి చెందిన నేతలు కమిటీలో నియమితులవుతారనే అంశం ఇంకా తేలాల్సి ఉంది.
 
ఎవరికి మద్దతుంటే..!
వాస్తవానికి అధికారపార్టీలో కమిటీల నియామకం వాయిస్‌ మెస్సేజ్‌ ప్రక్రియ ద్వారా జరుగుతుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. నిజంగా పనిచేసే నేతల పేర్లను కమిటీల పేర్కొనకపోయినప్పటికీ పార్టీ కార్యకర్తల నుంచి సేకరించే వాయిస్‌ మెస్సేజ్‌ ద్వారా కమిటీలో మార్పుచేర్పులు ఉంటాయని ఈ నేతలు స్పష్టం చేస్తున్నారు. నేతల మధ్య విభేదాలున్నప్పటికీ కమిటీల ఏర్పాటులో మాత్రం కేవలం నేతల సిఫారసులకే పెద్దపీట వేయడం కుదరదని అంటున్నారు. అయితే, కొత్తగా వచ్చిన నేతలు మాత్రం కేవలం తమ అనుచరులకే కమిటీలల్లో స్థానం దక్కేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలే నియోజకవర్గ ఇన్‌చార్జీలని.... వారు చెప్పించే కచ్చితంగా నెగ్గాలనే వాదన తెరమీదకు తీసుకొస్తున్నారు. తద్వారా కేవలం తమ అనుచరులకే పార్టీ కమిటీల అధికారాలు కట్టబెట్టి సంపూర్ణ అధికారాన్ని అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోనూ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేదిక చేసుకోవడంతో ఇప్పుడు అధికార రాజకీయ నాటకం రక్తికడుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement