ప్రారంభానికి పాస్పోర్టు సేవా కేంద్రం సిద్ధం
కర్నూలు హెడ్ పోస్టాఫీసులో పాస్పోర్టు సేవా కేంద్రం..ప్రారంభానికి సిద్ధమైంది.
కర్నూలు (ఓల్డ్సిటీ): కర్నూలు హెడ్ పోస్టాఫీసులో పాస్పోర్టు సేవా కేంద్రం..ప్రారంభానికి సిద్ధమైంది. కౌంటర్లు, క్యాబిన్లు, విషయ సూచిక బోర్డులతో పాటు వినియోగదారులకు, సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటయ్యాయి. అనంతపురం, ప్రకాశం జిల్లాలకు కూడా ఉపయోగపడేలా ఎంపీ బుట్టారేణుక ఈ కేంద్రాన్ని కర్నూలుకు మంజూరు చేయించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎంపీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు పోస్టల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రారంభమైతే కర్నూలు ప్రజలకు, ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది.
సోమవారం పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు.. పాస్పోర్టు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యాలయం ప్రతివారం సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిచేస్తుందన్నారు. పనివేళలు ఉదయం 9.00 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు (మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 వరకు భోజన విరామం) ఉంటాయని తెలిపారు. టోకన్లు జారీ చేసే సమయం సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తుందన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వెరిఫయింగ్ అధికారులు బి.బి.రావు, కార్తీక్, పోస్టల్శాఖ ఏఎస్పీ నాగానాయక్, ఇన్స్పెక్టర్ ఫజులుర్ రహ్మాన్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మద్దిలేటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.