Head Post Office
-
ప్రారంభానికి పాస్పోర్టు సేవా కేంద్రం సిద్ధం
కర్నూలు (ఓల్డ్సిటీ): కర్నూలు హెడ్ పోస్టాఫీసులో పాస్పోర్టు సేవా కేంద్రం..ప్రారంభానికి సిద్ధమైంది. కౌంటర్లు, క్యాబిన్లు, విషయ సూచిక బోర్డులతో పాటు వినియోగదారులకు, సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటయ్యాయి. అనంతపురం, ప్రకాశం జిల్లాలకు కూడా ఉపయోగపడేలా ఎంపీ బుట్టారేణుక ఈ కేంద్రాన్ని కర్నూలుకు మంజూరు చేయించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎంపీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు పోస్టల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రారంభమైతే కర్నూలు ప్రజలకు, ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. సోమవారం పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు.. పాస్పోర్టు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యాలయం ప్రతివారం సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిచేస్తుందన్నారు. పనివేళలు ఉదయం 9.00 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు (మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 వరకు భోజన విరామం) ఉంటాయని తెలిపారు. టోకన్లు జారీ చేసే సమయం సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తుందన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వెరిఫయింగ్ అధికారులు బి.బి.రావు, కార్తీక్, పోస్టల్శాఖ ఏఎస్పీ నాగానాయక్, ఇన్స్పెక్టర్ ఫజులుర్ రహ్మాన్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మద్దిలేటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాస్పోర్టు సేవా కేంద్రం మంజూరు
అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ వరంగల్ వరంగల్లో పాస్పోర్టు సేవా కేంద్రం మంజూరైంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వరంగల్లో పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. వరంగల్లో పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇటీవల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్కు లేఖ రాశారు. దీనికి సమాధానంగా సుష్మాస్వరాజ్ ఎంపీ కవితకు ఫిబ్రవరి 27న లేఖ రాస్తూ హన్మకొండ నక్కలగుట్టలోని హెడ్ పోస్టాఫీసులో పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తపాలా శాఖతో కలిసి దేశ వ్యాప్తంగా పలు నగరాల్లోనూ పోస్టాఫీసులలో పాస్పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని పోస్టాఫీసు పాస్పోర్టు కేంద్రాలుగా పిలవనున్నారు. త్వరలోనే ఇలాంటిది హన్మకొండలో ఏర్పాటు కానుంది. -
5 నుంచి హెడ్ పోస్టాఫీసుల్లో టీటీడీ దర్శనం టికెట్లు
గాంధీనగర్ : ఈనెల ఐదో తేదీ నుంచి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన తపాలా కార్యాలయూల్లో టీటీడీ దర్శ నం టికెట్ల విక్రయూలు జరుపుతామని చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ తెలిపారు. స్థానిక తపాలా కార్యాలయంలో ‘పిడికెడు బియ్యం’ పథకం కింద పోస్టల్ సిబ్బంది సేకరించిన బియ్యాన్ని శుక్రవారం ఆయన నగరంలోని వృద్ధాశ్రమానికి అందజేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రలో 56, తెలంగాణలోని 39 ప్రధాన తపాలా కార్యాలయూల్లో టికెట్లు అందుబాటు లో ఉంటాయని చెప్పారు. జనవరి 25 నాటికి పోస్టాఫీసుల్లో క్యాష్లెస్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. దీనిద్వారా బ్యాంకులు, ఏటీఎంలు అందుబాటులో లేనిచోట పోస్టాఫీసుల ద్వారా రూ. వెయ్యిలోపు నగదు చెల్లింపులు చేయవచ్చన్నారు. ఇందుకోసం అన్ని పోస్టాఫీసుల్లో స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ఈ-కామర్స్ వంటివి కూడా ఈ ఏడాదే అందుబాటులోకి వస్తాయన్నారు. సామాజిక బాధ్యత కింద ‘పిడికెడు బియ్యం’ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. సిబ్బంది నిత్యం తమ ఇళ్లల్లో పిడికెడు బియ్యాన్ని ఈ పథకానికి కేటాయిస్తారని, నెలాఖరున నిరుపేదలకు అందజేస్తారన్నారు. భవిష్యత్తులో పోస్టల్ డిపార్ట్మెంట్ను ఆధునికీకరిస్తామన్నారు. గాంధీనగర్ పోస్టాఫీస్ సిబ్బంది సేకరించిన 50 కేజీల బియ్యాన్ని కానూరులోని సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ సంపత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
పోస్టల్ నిధుల గోల్మాల్పై విచారణ
ఒంగోలు సబర్బన్: ఒంగోలు పోస్టల్ సర్కిల్లోని పోస్టాఫీసుల్లో జరిగిన నిధుల గోల్మాల్పై పోస్టల్ శాఖ డెరైక్టర్ విచారణ చేస్తున్నారని పోస్ట్మాస్టర్ జనరల్ (పీఎంజీ) సంపత్ వెల్లడించారు. విజయవాడ నుంచి వచ్చిన ఆయన శనివారం జిల్లాలోని పలు పోస్టాఫీసులను ఆకస్మిక తనిఖీ చేశారు. అందులో భాగంగా తొలుత ఒంగోలు హెడ్పోస్టాఫీస్ను పీఎంజీ పరిశీలించారు. జిల్లాలోని పోస్టాఫీసుల్లో దాదాపు రూ.20 లక్షల వరకు నిధులు గోల్మాల్ అయిన విషయాన్ని ‘సాక్షి’ ఆయన దృష్టికి తీసుకెళ్లింది. సింగరాయకొండ, కందుకూరు, ఒంగోలు పోస్టాఫీసుల్లో నిధుల గోల్మాల్ అంశంపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పోస్టుబాక్స్ తీసిందీ లేనిది ‘నాణ్యత’తో తెలుసుకోవచ్చు... పోస్టల్ శాఖకు సంబంధించిన నూతన పథకాల గురించి వివరించారు. కొత్తగా ‘నాణ్యత’ పథకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలుత హైదరాబాద్లో ప్రవేశపెట్టారన్నారు. పోస్ట్బాక్స్ లోపల డేటాబేస్ చిప్ అమర్చి, ఆ చిప్ నుంచి నేరుగా పోస్టల్ కార్యాలయాలకు ఆన్లైన్ కనెక్షన్ ఇస్తారన్నారు. ఈ ఆన్లైన్ ద్వారా హైదరాబాద్లోని చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ ప్రతిరోజు పోస్ట్బాక్సుల్లో వేసిన ఉత్తరాలు తీస్తున్నది, లేనిది తెలుసుకోవచ్చునన్నారు. ప్రతి పోస్ట్బాక్సులో రోజూ ఎన్ని ఉత్తరాలు వేస్తున్నారో కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం వలన అర్థమవుతుందని చెప్పారు. పోస్టాఫీసుల్లో మీ-సేవ: పోస్టాఫీస్ల్లో మీ-సేవ సౌకర్యం కూడా కల్పించామని పీఎంజీ తెలిపారు. 90 రకాల డాక్యుమెంట్లు మీ-సేవ ద్వారా ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. రెవెన్యూ రికార్డుల మొదలుకొని అనేక రకాల రికార్డులను అందించవచ్చునన్నారు. ‘సునాయాసం’ అనే మరో పథకాన్ని కూడా మీ-సేవతో పాటు ఏర్పాటు చేశామని.. ఈ పథకం ద్వారా వాటర్ బిల్లులు, విద్యుత్, మున్సిపల్, టెలిఫోన్ బిల్లులతో పాటు వినియోగదారులకు అవసరమైన మరికొన్ని రకాల సేవలు అందిస్తున్నామన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా అన్ని పోస్టాఫీసులను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాల్లో పర్యటించి పోస్టాఫీసుల్లో ఉండాల్సిన స్టేషనరీ, వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించటానికి అన్ని రకాల అప్లికేషన్లు, ఫారాలు వృథా కాకుండా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశిస్తున్నట్లు వివరించారు. ఒంగోలు హెడ్పోస్టాఫీస్కు కంప్యూటర్లు కావాలని, వీటితో పాటు మరికొన్ని స్టేషనరీ అవసరమవుతాయని చెప్పారని అందుకోసం అన్ని సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఇక్కడ నుంచి అద్దంకి పోస్టాఫీస్ను పరిశీలించేందుకు వెళ్లారు. ఆయనతో పాటు ఒంగోలు హెడ్ పోస్ట్మాస్టర్ పి.వెంకటేశ్వర్లు, ఎస్ఎస్పీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.