పోస్టల్ నిధుల గోల్‌మాల్‌పై విచారణ | Inquiry on Postal funds irregularities | Sakshi
Sakshi News home page

పోస్టల్ నిధుల గోల్‌మాల్‌పై విచారణ

Nov 16 2014 1:45 AM | Updated on Sep 18 2018 8:19 PM

ఒంగోలు పోస్టల్ సర్కిల్‌లోని పోస్టాఫీసుల్లో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై....

ఒంగోలు సబర్బన్:  ఒంగోలు పోస్టల్ సర్కిల్‌లోని పోస్టాఫీసుల్లో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై పోస్టల్ శాఖ డెరైక్టర్ విచారణ చేస్తున్నారని పోస్ట్‌మాస్టర్ జనరల్ (పీఎంజీ) సంపత్ వెల్లడించారు. విజయవాడ నుంచి వచ్చిన ఆయన శనివారం జిల్లాలోని పలు పోస్టాఫీసులను ఆకస్మిక తనిఖీ చేశారు. అందులో భాగంగా తొలుత ఒంగోలు హెడ్‌పోస్టాఫీస్‌ను పీఎంజీ పరిశీలించారు. జిల్లాలోని పోస్టాఫీసుల్లో దాదాపు రూ.20 లక్షల వరకు నిధులు గోల్‌మాల్ అయిన విషయాన్ని ‘సాక్షి’ ఆయన దృష్టికి తీసుకెళ్లింది. సింగరాయకొండ, కందుకూరు, ఒంగోలు పోస్టాఫీసుల్లో  నిధుల గోల్‌మాల్ అంశంపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

 పోస్టుబాక్స్ తీసిందీ లేనిది  ‘నాణ్యత’తో తెలుసుకోవచ్చు...
 పోస్టల్ శాఖకు సంబంధించిన నూతన పథకాల గురించి వివరించారు. కొత్తగా ‘నాణ్యత’ పథకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెట్టారన్నారు. పోస్ట్‌బాక్స్ లోపల డేటాబేస్ చిప్ అమర్చి, ఆ చిప్ నుంచి నేరుగా పోస్టల్ కార్యాలయాలకు ఆన్‌లైన్ కనెక్షన్ ఇస్తారన్నారు. ఈ ఆన్‌లైన్ ద్వారా హైదరాబాద్‌లోని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ప్రతిరోజు పోస్ట్‌బాక్సుల్లో వేసిన ఉత్తరాలు తీస్తున్నది, లేనిది తెలుసుకోవచ్చునన్నారు. ప్రతి పోస్ట్‌బాక్సులో రోజూ ఎన్ని ఉత్తరాలు వేస్తున్నారో కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం వలన అర్థమవుతుందని చెప్పారు.

 పోస్టాఫీసుల్లో మీ-సేవ:
 పోస్టాఫీస్‌ల్లో మీ-సేవ సౌకర్యం కూడా కల్పించామని పీఎంజీ తెలిపారు. 90 రకాల డాక్యుమెంట్లు మీ-సేవ  ద్వారా ప్రజలకు అందిస్తున్నామని వివరించారు. రెవెన్యూ రికార్డుల మొదలుకొని అనేక రకాల రికార్డులను అందించవచ్చునన్నారు. ‘సునాయాసం’ అనే మరో పథకాన్ని కూడా మీ-సేవతో పాటు ఏర్పాటు చేశామని.. ఈ పథకం ద్వారా వాటర్ బిల్లులు, విద్యుత్, మున్సిపల్, టెలిఫోన్ బిల్లులతో పాటు వినియోగదారులకు అవసరమైన మరికొన్ని రకాల సేవలు అందిస్తున్నామన్నారు.

స్వచ్ఛ భారత్‌లో భాగంగా అన్ని పోస్టాఫీసులను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.  జిల్లాల్లో పర్యటించి పోస్టాఫీసుల్లో ఉండాల్సిన స్టేషనరీ, వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించటానికి అన్ని రకాల అప్లికేషన్లు, ఫారాలు వృథా కాకుండా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశిస్తున్నట్లు వివరించారు. ఒంగోలు హెడ్‌పోస్టాఫీస్‌కు కంప్యూటర్లు కావాలని, వీటితో పాటు మరికొన్ని స్టేషనరీ అవసరమవుతాయని చెప్పారని అందుకోసం అన్ని సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఇక్కడ నుంచి అద్దంకి పోస్టాఫీస్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. ఆయనతో పాటు ఒంగోలు హెడ్ పోస్ట్‌మాస్టర్ పి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఎస్‌పీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement