టీడీపీ ఎమ్మెల్యే పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు | Non bailable case files on TDP MLA and his followers | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Jul 9 2015 10:10 AM | Updated on Apr 4 2019 2:14 PM

టీడీపీ ఎమ్మెల్యే పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు - Sakshi

టీడీపీ ఎమ్మెల్యే పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్తోపాటు ఆయన గన్మెన్తో సహా 52 మందిపై కృష్ణాజిల్లా ముసునూరు పోలీస్ స్టేషన్లో నాన్బెయిలబుల్ కేసులు నమోదయింది.

నూజివీడు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్తోపాటు ఆయన గన్మెన్తో సహా 52 మందిపై కృష్ణాజిల్లా ముసునూరు పోలీస్ స్టేషన్లో నాన్బెయిలబుల్ కేసులు నమోదయింది. వారిపై 353, 334, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్వార్వో వనజాక్షి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బుధవారం కృష్ణాజిల్లా నూజివీడు తాలుకా ముసునూరు మండలం రంగంపేట ఇసుకరేవులో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో అక్రమ ఇసుక తవ్వుతున్న వారిని ఎమ్మార్వో వనజాక్షి, ఆమె వెంట ఉన్న సిబ్బంది ప్రశ్నించారు. దాంతో ఆగ్రహించిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ చింతంనేని ప్రభాకర్... వనజాక్షిపై తన అనుచరులతో దాడిచేయించి ఇసుకలో ఈడ్చికొట్టారు. ఆయనతోపాటు తీసుకొచ్చిన ఆరుగురు మహిళలు తహశీల్దార్‌పై దాడిచేసి గోళ్లతో ఆమె ముఖంపై రక్కారు. ఇసుక తవ్వుకుంటాం... ఎవడడ్డొస్తాడో చూస్తా..నంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించారు.

25 ట్రక్కుల ఇసుక, పొక్లెయిన్‌లు తీసుకొని వెళ్లిపోతూ ఎమ్మెల్యే చింతంనేని తహశీల్దార్‌ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. దానికి ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. ఎమ్మెల్యే గన్‌మెన్‌లు కూడా తహశీల్దార్‌పై దాడి చేశారు.  అంతేకాకుండా ఆమెతో పాటు ఆర్‌ఐ, ముగ్గురు వీఆర్‌వోలు, ముగ్గురు వీఆర్‌ఏలు, కంప్యూటర్ ఆపరేటర్లపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి కొట్టారని తహశీల్దార్ వనజాక్షి ముసునూరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. దాంతో గురువారం ఎమ్మెల్యే ఆయన అనుచరులపై ముసునూరు పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.

ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడిని రెవెన్యూ సంఘాలు మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ దాడిపై చంద్రబాబు ప్రభుత్వం స్పందించకుంటే గోదావరి పుష్కరాలు, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ విధులకు దూరంగా ఉండాలని రెవెన్యూ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement