మెమోరీ కార్డ్ దొంగిలించాడని.. | Murder attempt in Hyderabad | Sakshi
Sakshi News home page

మెమోరీ కార్డ్ దొంగిలించాడని..

Aug 7 2016 5:50 PM | Updated on Sep 4 2018 5:21 PM

మెమోరీ కార్డ్ దొంగిలించాడన్న కారణంగా స్నేహితుడి తండ్రిని కిడ్నాప్ చేసి రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

- స్నేహితుని తండ్రి కిడ్నాప్
హైదరాబాద్ సిటీ

మెమోరీ కార్డ్ దొంగిలించాడన్న కారణంగా స్నేహితుడి తండ్రిని కిడ్నాప్ చేసి రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీ నగర్‌లో నివసించే సిహెచ్.కృష్ణ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

 

గత ఎనిమిది సంవత్సరాల నుంచి తన తమ్ముడు శ్రీకాంత్‌కు అదే ప్రాంతంలో నివసిస్తున్న బాబర్ స్నేహితుడు. ఇటీవల బాబర్ మెమోరీ కార్డ్‌ను శ్రీకాంత్ తీసుకున్నారు. అయితే మెమోరీ కార్డు ఇవ్వడానికి నిరాకరించడంతో పలుమార్లు బాబర్ ప్రశ్నించి అందులో తన కుటుంబానికి చెందిన ముఖ్యమైన ఫొటోలు ఉన్నాయని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో బాబర్ ఎన్బీ నగర్‌లోని కృష్ణ నివాసానికి వచ్చి బలవంతంగా తన ఆటోలో ఎక్కించుకొని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 51వైపు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో తీవ్రంగా కొట్టాడు.

 

రాయితో తలపై మోదడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. హత్యాయత్నం చేయడంతో నిందితుడి నుంచి కృష్ణ తప్పించుకొని కొద్ది దూరం వెళ్లి తలదాచుకున్నాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై చర్య తీసుకోవాల్సిందిగా కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బాబర్‌పై కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement