వచ్చే నెల నుంచి కిరోసిన్ నిలిపివేత
-
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడి
కోరుకొండ : వచ్చే నెల నుంచి రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ను సరఫరా నిలివేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలిన విజ్ఞప్తి చేశారు. కోరుకొండలోని సివిల్ సప్లయ్స్ గోడౌన్ను ఆయన, రాష్ట్ర న్యాయ శాఖా మంత్రి కొల్లు రవీంద్రలు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ సరుకులను లబ్ధిదారులకు సక్రమంగా సరఫరా చేయకపోతే డీలర్లపై కఠిన చర్యలు తీసుకొంటామని, రేషన్ డీలర్లు తమ పనితీరును మార్చుకోవాలని, అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ షాపులను నిర్ణీత సమయాల్లో తెరచి ఉంచాలని, సరకుల తూకాలు సక్రమంగా ఉండాలని అన్నారు. గోడౌన్ నుంచి రేషన్ షాపులకు సరకులను తరలించే సమయంలో తరుగు వస్తే రవాణా చేసే వ్యక్తులనే బాధ్యులుగా చేస్తామని స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీలపై రేషన్ షాపుల వద్ద ఒత్తిడి లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే వీవీ శివరామరాజు, జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎం ఎ.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు