కారుణ్య నియామకాల కింద జిల్లా పరిషత్ పరిధిలోని పలు శాఖల్లో తొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చారు.
అనంతపురం సిటీ : కారుణ్య నియామకాల కింద జిల్లా పరిషత్ పరిధిలోని పలు శాఖల్లో తొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం జిల్లా పరిషత్లోని సమావేశ భవనంలో సీఈఓ రామచంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్మన్ చమన్ వారికి నియామక ఉత్తర్వులు అందజేశారు. విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన ఒక్కో ఉద్యోగి కుటుంబంలో ఒక్కొక్కరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
ఈ మేరకు బీఎన్.మానసరాజన్ను జూనియర్ సహాయకులుగా కోడూరు జిల్లా ప్రాథమికోన్నత పాఠశాలలోనూ, టి.సరోజను మడకశిర బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలోనూ నియమించారు. ఆఫీస్ సబార్డినేటర్లుగా హిందూపురం పీఆర్ఐ సబ్ డివిజన్కు ఆర్.అశ్వినిని, జిల్లా పరిషత్ అనంతపురానికి ఎంవీఎస్ ప్రసాద్ను, ధర్మవరం మండల ప్రజా పరిషత్కు విజయలక్ష్మిని, ముదిగుబ్బ మండల ప్రజా పరిషత్కి బి.మురళీకార్తీక్ను, అనంతపురం పీఆర్పీఐయు డివిజన్కు నాగమణిని నియమించారు. గుత్తి మండల పరిషత్కు అబ్దుల్ మహరాజ్ను, అనంతపురం డివిజన్ ఆఫీస్ సబార్డినేటరుగా బి.నారాయణస్వామిని నియమించారు.
‘చైర్మన్ చొరవ అభినందనీయం’
పెద్దలను కోల్పోయిన కుటుంబాల దీనస్థితిని దృష్టిలో ఉంచుకున్న ప్రస్తుత చైర్మన్ త్వరగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని సీఈఓ రామచంద్ర, 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు నాగభూషణం, చంద్రా, షేక్షా తదితరులు కొనియాడారు. రెండేళ్లలోనే ఇలా 69 మందికి అవకాశం దక్కిందన్నారు.