వేధిస్తున్నాడంటూ యువతి ఫిర్యాదు

Women Complaint File Against Forced Marriage in Hyderabad - Sakshi

నిందితుడి అరెస్ట్‌

బంజారాహిల్స్‌: తన మెడలో బలవంతంగా తాళి కట్టి ఆరు నెలల పాటు బెదిరించి కాపురం చేశాడని ఇటీవల కాలంలో తనపై అనుమానం పెంచుకుంటూ పీకలదాకా మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్ట్‌ చేశారు. అంబర్‌పేట్‌కు చెందిన అనిల్‌(24) అనే యువకుడు గత అయిదు సంవత్సరాల నుంచి శ్రీకృష్ణానగర్‌లో నివసించే యువతి(19)ని ప్రేమిస్తున్నాడు. ఆరు నెలల క్రితం గుడికి వెళ్ళాలని అనిల్‌ ఆ యువతిని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడికి తీసుకెళ్ళాడు.

ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం ఓ చెట్టు కింద ఆమె మెడలో తాళికట్టాడు. మరొకరితో పెళ్ళి కాకుండా చేశాడని తనతో రాకపోతే బతుకు ఆగమవుతుందంటూ ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆ  యువకుడితో పాటు బాధిత యువతి అంబర్‌పేటకు వెళ్ళి కాపురం పెట్టింది. ఆరు నెలలు గడవకముందే అనిల్‌ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ మానసికంగా వేధించసాగాడు. ఇటీవల మద్యం తాగి వచ్చి కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఆమె పదిరోజుల క్రితం తన తల్లి వద్దకు వచ్చింది. అయినాసరే రోజూ ఇంటికి వచ్చి బెదిరించసాగాడు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనిల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top