సహజీవనం చేస్తున్న వ్యక్తి దారుణం | Woman Murdered in Visakhapatnam | Sakshi
Sakshi News home page

మహిళ హత్య

Jan 1 2020 1:07 PM | Updated on Jan 1 2020 1:07 PM

Woman Murdered in Visakhapatnam - Sakshi

రోదిస్తున్న దేవి పిల్లలు

విశాఖపట్నం, నర్సీపట్నం: ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని 22వ వార్డు గంగాధర్‌ థియేటర్‌ ప్రాంతంలో మంగళవారం  సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. పట్టణ పోలీసుల కథనం  ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  పట్టణంలోని 22వ వార్డుకు చెందిన రెడ్డి దేవి(35) వార్డు వలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. భర్త నుంచి విడిపోయింది. ఓ టీవీ చానల్‌  విలేకరిగా పని చేస్తున్న  పి.మురళీ(40)తో   పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా వీరిద్దరూ  సహజీవనం సాగిస్తూ  పెదబొడ్డేపల్లిలో నివాసం ఉంటు న్నారు. మురళీకి వివాహం జరిగింది. భార్య, బాబు ఉన్నారు.  దేవి మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుందనే అనుమానం మురళీకి వచ్చింది. దీంతో  వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో  విధులు ముగించుకుని మంగళవారం దేవి  పుట్టింటికి వెళ్లింది. ఈలోపు మురళీ అక్కడకు చేరుకున్నాడు. దీంతో  ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఘర్షణ పడుతూనే  దేవి 100 ఫోన్‌ చేసి, మురళీ మద్యం తాగి వచ్చి తనను ఇబ్బంది  పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చే సమయానికి  ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో మురళీ  ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. దీంతో  ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు చూసి, మృతి  చెందినట్టు గుర్తించారు. ము రళీ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. మృతురాలికి బాబు, పాప ఉన్నారు. బాబు శ్యామ్‌  వేములపూడి మోడల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. పాప హానీ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. వీరిద్దరికి తల్లే సంరక్షులు కావడంతో  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమను ఎవరు చూస్తారంటూ పిల్లలు రోదించడంతో చూసిన వారు కన్నీటి పర్యాంతమయ్యారు.   ఏఎస్పీ వై.రిషాంత్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ స్వామినాయుడిని  అడిగి  వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి సోదరుడు రెడ్డి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మురళీ కేసు నమోదు చేస్తున్నామని సీఐ స్వామినాయుడు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement