భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా

Wife Protest infront of Husband House in Hyderabad - Sakshi

జూబ్లీహిల్స్‌ (హైదరాబాద్‌): ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. కొన్నేళ్ల తర్వాత భర్త మరో మహిళ మోజులో పడి భార్యను వదిలేశాడు. పిల్లలను తీసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లడంతో దిక్కుతోచని బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగిన సంఘటన మధురానగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామానికి చెందిన తోట లక్ష్మి, కృష్ణశంకర్‌ 2008లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రెండేళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన లక్ష్మి, కృష్ణ శంకర్‌ దంపతులు మధురానగర్‌లోని సీ 83బ్లాక్‌లోని దివ్య రెసిడెన్సీలో అద్దెకు ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం శంకర్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసిన లక్ష్మి భర్తతో గొడవకు దిగింది. గత జనవరిలో ఎర్రుపాలెంలో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కృష్ణశంకర్‌ తన ఇంటికి తాళం వేసుకొని పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. తన పిల్లలను అపహరించాడని ఆమె ఎస్సార్‌నగర్‌లో ఫిర్యాదు చేయగా, తమ పరిధి కాదని, మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాలని వారు సూచించడంతో అక్కడికి  వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.

చేతిలో చిల్లిగవ్వ లేదు...
చేతిలో చిల్లిగవ్వ లేదు. తిండి లేదు. బట్టలు కూడా లేవు. తాళం పగలగొట్టి లోపలికి వెళదామంటే ఇరుగుపొరుగు అడ్డుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నాకు న్యాయం చేయాలి.
- బాధితురాలు లక్ష్మి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top