యువకుడ్ని దారుణంగా హింసించిన వైనం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగర శివారు ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. బాకీ సొమ్ము ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడ్ని చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా చితకబాదింది ఓ రౌడీ గ్యాంగ్. మారికవలసలోని రాజీవ్ గృహ కల్ప వద్ద జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం మారికవలస ప్రాంతానికి చెందిన దంతేశ్వరరావ్ అనే యువకుడు తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ రౌడీ గ్యాంగ్ అతడిపై దాడికి దిగింది. చెట్టుకు కట్టేసి వచక్షణా రహితంగా హింసింది. అతడ్ని బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు గ్యాంగ్ సభ్యులు. ( అమ్మా.. నేనూ నీవెంటే! )
ఒకానొక దశలో అతడి మెడకు తాడు బిగించి గట్టిగా లాగటంతో ఊపిరాడక గిలగిలలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నారు. గ్రూపుగా ఏర్పడ్డ కొందరు యువకులు గత ఆరునెలలుగా రౌడీ ఇజానికి పాల్పడుతున్నట్లు తేలింది. ( సారా కోసం వెళ్లి.. ఆటోలో శవమై..)