పెళ్లి పేరిట మోసం.. న్యాయవాది అరెస్ట్‌

Lawyer Held in Young Women Cheating With Case - Sakshi

చైతన్యపురి: వివాహం చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి యువతిని మోసం చేసిన కేసులో సరూర్‌నగర్‌ పోలీసు లు ఓ న్యాయవాదిని అరెస్ట్‌ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడకు చెందిన బైడ్‌ సుభాష్‌ (50) నగరంలోని ఓ కళాశాలలో 2011–14లో ఎల్‌ఎల్‌బీ చదివాడు. తనతో పాటు చదివే ఓ యువ తికి స్కాలర్‌షిప్‌ రాకపోవటంతో తమవద్దే ఆశ్రయం కల్పించాడు. అప్పటి స్నేహాన్ని ఆసరా చేసుకుని 2015లో  తన నివాసానికి ఆమెను పిలిపించి మత్తు మందు కలిపిన బిర్యానీ తినిపించాడు.

మత్తులోకి జారుకున్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఆమెను నగ్నంగా ఫొటోలు తీసిన అతను వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని, స్నేహితులకు పంపిస్తానని బ్లాక్‌ మెయిల్‌ చేయటం మొదలు పెట్టాడు. అనంతరం వివాహం చేసుకుంటానని నమ్మించి 2015 నుంచి 2019 వరకు కామేశ్వరరావు కాలనీలో ఓ ఇంట్లో సహజీవనం చేశాడు. ఆమెపై మోజు తీరటంతో పెళ్లి చేసుకోనని ఇంటి నుంచి  బయటకు నెట్టేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సుభాష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సుభాష్‌ పాత నేరస్తుడని, ఇప్పటికే అతడిపై రెండు కేసులున్నాయన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top