కొడుకు కళ్లెదుటే తల్లి.. దారుణ హత్య

Elderly Woman Brutal Murders In Karimnagar - Sakshi

రామగుండం: పట్టణంలోని ముబారక్‌నగర్‌లో ఓ సైకో చేతిలో శుక్రవారం పట్టపగలు ఓ వృద్ధురాలు హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. ముబారక్‌నగర్‌కు చెందిన సమ్మెట తిరుపతి క్షౌ రవృత్తిని నిర్వహిస్తుంటాడు. అదే కాలనీలో తన నివాసముండగా.. పక్కపక్కన రెండు గదులున్నాయి. అందులో ఒక గదిలో తిరుపతి కుటుంబసభ్యులతోపాటు మరో గదిలో తిరుపతి తల్లి సమ్మెట బాలమ్మ(65) నివాసముంటోంది. పక్కింట్లో ఉండే నగునూరి నరేష్‌(25) అనే యువకుడు ఏడాది క్రితం తిరుపతి కుటుంబసభ్యులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో.. నరేష్‌పై రామగుండం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అప్పటి ఎస్సై రాజ్‌కుమార్‌గౌడ్‌ సదరు యువకుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి హెచ్చరించి పంపించారు. కుటుంబసభ్యులు నరేష్‌ను మందలించి ప్రవర్తన మార్చుకోవాలని సూచించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటి నుంచి తిరుపతి కుటుంబసభ్యులపై కక్ష పెంచుకొని అదును కోసం చూస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం బాలమ్మ మంచంలో నిద్రించడం గమనించాడు.

వృద్ధురాలి గదిలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న గొడ్డలితో తలపై మోదాడు. శబ్దం రావడంతో తిరుపతి కుటుంబసభ్యులు అప్రమత్తమై వెళ్లి చూడగా.. వారి ముందే తలపై మరోసారి గొడ్డలితో వేటు వేశాడు. దీంతో అక్కడకక్కడే మృతిచెందింది. అడ్డుకోబోయిన తిరుపతిపై సైతం దాడి చేసేందుకు యత్నించి పారిపోయాడు. సమ్మెట తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బుద్ధె స్వామి, ఎస్సై పసుల దత్తాత్రి తెలిపారు.

సందర్శించిన డీసీపీ
ఘటన స్థలిని గోదావరిఖని డీసీపీ రక్షిత కె.మూర్తి సందర్శించారు. కుటుంబసభ్యులను వివరాలడిగి తెలుసుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుంటామని, సైకోగా మారిన నగునూరి నరేష్‌ను పట్టుకొని చట్టపరమైన శిక్ష పడేందుకు చర్యలు చేపడతామని అన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top