రెండో రోజూ ‘సుజనా’పై సీబీఐ దాడులు

CBI raids Sujana Chowdary office And  house in Hyd AP - Sakshi

మరిన్ని ఆధారాల కోసం సోదాలు చేసిన అధికారులు

పలు పత్రాలు, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న సీబీఐ 

దాడుల్లో పాల్గొన్న దాదాపు 30 మంది అధికారులు

షెల్‌ కంపెనీలపై అధికారుల ఆరా

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై సీబీఐ దాడులు రెండోరోజు ఆదివారం కూడా కొనసాగాయి. శనివారం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో 12 చోట్ల దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం రాత్రి సీబీఐ అధికారులు సీజ్‌ చేసిన నాగార్జున హిల్స్‌లోని సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కార్యాలయంతోపాటు, సుజనా నివాసంలో ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. ముందురోజు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల తాలూకు వివరాలపై కంపెనీలోని పలువురు డైరెక్టర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆదివారం తనిఖీల్లో బ్యాంకింగ్‌ ఫ్రాడ్‌ సెల్‌ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు. బెంగళూరు, ఢిల్లీ నుంచి వచ్చిన దాదాపు 30 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్`గొన్నారు.

షెల్‌ కంపెనీలపై ఆరా?...  
సుజనా గ్రూపునకు చెందిన షెల్‌ కంపెనీలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలిసింది. బెస్ట్‌ క్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌) కంపెనీ, సుజనా గ్రూప్‌నకు చెందింది. దీన్ని సుజనా చౌదరి సీబీఐ మాజీ చీఫ్‌ విజయరామారావు కుమారుడితో కలసి ఏర్పాటు చేశారు. 2010 నుంచి 2013 మధ్య బ్యాంకుల కన్సార్టియం నుంచి దాదాపుగా రూ.315 కోట్ల మేర రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో ఆంధ్రాబ్యాంకు రూ.71 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకు రూ.120 కోట్లు, సెంట్రల్‌ బ్యాంకు రూ.124 కోట్ల చొప్పున రుణాలు మంజూరు చేశాయి. గంగాస్టీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, భాగ్యనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్, తేజస్విని ఇంజనీరింగ్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీల పేర ఈ రుణాలు తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, వాటి నుంచి వివిధ డొల్ల కంపెనీలకు రుణాలు మళ్లించినట్లు గుర్తించిన సీబీఐ వాటి చిరునామాలపై ఆరా తీసిందని తెలిసింది. వాటి యజమానులు, చిరునామాలు, ఆఫీసు కార్యాలయాలు ఎక్కడున్నాయి? అన్న సమాచారం కోసం ప్రయత్నించినట్లు సమాచారం. ఆంధ్రాబ్యాంకు తమకు రావాల్సిన రూ.71 కోట్ల కేసులో చేసిన ఫిర్యాదు ఆధారంగా తాజాగా దాడులు జరిగాయి. ఇదే వ్యవహారంలో మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై ఏప్రిల్‌లో దాడులు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రూ.315 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top