శంకర్‌పల్లిలో దారుణం

Boyfriend Killed His Lover In Pragati Resort - Sakshi

అనుమానంతో ప్రియురాలి గొంతుకోసి హత్య

శంకర్‌ పల్లి రిసార్ట్‌లో దారుణం

విషయం బయటకు పొక్కకుండా ఉంచే యత్నం చేసిన యాజమాన్యం, పోలీసులు

సాక్షి, శంకర్‌పల్లి : రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌ పల్లి రిసార్ట్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు డిగ్రీ విద్యార్థిని దారుణంగా కొంతు కోసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా శిరీష అనే  డిగ్రీ విద్యార్థి శంకర్‌పల్లిలోని ప్రగతి రిసార్ట్‌లో దారుణ హత్యకు గురైంది. ఆమె ప్రియుడు సాయిప్రసాద్‌ ఈ దారుణానికి పాల్పాడ్డారు. గత కొంతకాలంగా శిరీష, సాయి ప్రసాద్‌ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల శిరీష మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య కొంతకాలంగా వాగ్వాదం నడుస్తోంది.

శిరీషపై కోపం పెంచుకున్న సాయిప్రసాద్‌ పథకం ప్రకారం, మాట్లకుందాం రమ్మంటూ ఆమెను ప్రగతి రిసార్ట్‌కు పిలిచాడు. రిసార్ట్‌లో కాటేజీ బుక్‌ చేసుకొని ఏకాంతంగా గడిపినట్టు సమాచారం. అనంతరం యువకుడి గురించి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనను మోసం చేస్తోందని ఆవేశంగా ఉన్న సాయిప్రసాద్‌ శిరీష గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. హత్య విషయం బయటకు పొక్కితే ఇబ్బందులు ఎదురౌతాయని భావించిన రిసార్ట్‌ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కానీ హత్య మధ్యాహ్నం 2 గంటలకు జరిగితే, రాత్రి 11 గంటలకు తల్లిదండ్రులకు విషయం తెలియచేశారు.

హుటాహుటిన అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు శిరీష మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. పోలీసులు నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని శిరీష మృతదేహంతో రిసార్ట్‌ ముందు ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో నిందితుడు సాయిప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నేడు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.

పెళ్లి కాని వారిని ఎలా అనుమతిస్తారు: శిరీష తండ్రి
ఈ సంఘటనపై మృతురాలి తండ్రి ఈశ్వర్‌ స్పందింస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు. పెళ్లి కాని వారిని రిసార్ట్‌లోకి ఎలా అనుమతిస్తారంటూ నిలదీశారు.రిసార్ట్స్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top