సహారా చీఫ్ సుబ్రతా రాయ్సహా వివాదంలోని గ్రూప్ రెండు సంస్థల డెరైక్టర్లు ముగ్గురు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి, వందనా భార్గవలు ఈ నెల 26న స్వయంగా తన ముందు హాజరుకావాలని ఆదేశించింది.
సహారా సుబ్రతారాయ్కి సుప్రీం ఆదేశం
ముగ్గురు డెరైక్టర్లకు కూడా...
ఇన్వెస్టర్లకు రూ.20,000 కోట్ల
పునఃచెల్లింపులు జరపకపోవడంపై ఆగ్రహం
కంపెనీ అందించిన సేల్ డీడ్స్ ఆస్తుల అమ్మకాలపై
ముందుకు వెళ్లడానికి సెబీకి అనుమతి
న్యూఢిల్లీ: నిబంధనలకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్లు రెండు నిధులు సమీకరించడం, తాను ఆదేశించినప్పటికీ వాటిని తిరిగి చెల్లించకపోవడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సహారా చీఫ్ సుబ్రతా రాయ్సహా వివాదంలోని గ్రూప్ రెండు సంస్థల డెరైక్టర్లు ముగ్గురు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి, వందనా భార్గవలు ఈ నెల 26న స్వయంగా తన ముందు హాజరుకావాలని ఆదేశించింది. రూ.20,000 కోట్ల రికవరీకి సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్కు గ్రూప్ అందించిన ఆస్తుల సేల్ డీడ్స్కు సంబంధించిన అమ్మకాలకు వేలంసహా తదుపరి చర్యలు తీసుకోవచ్చని, తద్వారా సంబంధిత సొమ్ముని రికవరీ చేసుకోవచ్చని సుప్రీం పేర్కొంది. గ్రూప్పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దాఖలు చేసిన మూడు ధిక్కార పిటిషన్లను విచారణ సందర్భంగా కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ కేహార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తాజా ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ గ్రూప్ ఇచ్చిన సేల్డీడ్స్ ఇప్పటికే ఏదైనా తనఖాలో ఉన్నట్లయితే, కంపెనీకి వ్యతిరేకంగా క్రిమినల్ కేసుకూడా పెట్టవచ్చని సెబీకి సుప్రీం సూచించింది. కేసుపై ఒక సుస్పష్ట, తార్కిక ముగిం పునకు రావాల్సిన అవసరం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. గడచిన యేడాదిన్నరగా తన ఆదేశాలను పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించింది. పైగా ఇన్వెస్టర్లకు డబ్బు ఇప్పటికే చెల్లించేశామంటూ గ్రూప్ వాదం చేయడమేమిటని ప్రశ్నించింది.