
షేర్లకూ లాభాల మెరుపు
బంగారంపై భారతీయ మహిళల మోజు అంతా ఇంతా కాదు. మెరిసే నగలు ధరించి మురిసిపోతుంటారు. పురుషులు కూడా తక్కువేం తినలేదు
బంగారంపై భారతీయ మహిళల మోజు అంతా ఇంతా కాదు. మెరిసే నగలు ధరించి మురిసిపోతుంటారు. పురుషులు కూడా తక్కువేం తినలేదు. చెయిన్లు, బ్రేస్లెట్లు ధరించాలని ఉవ్విళ్లూరుతుంటారు. బంగారంపై పెట్టుబడి అత్యుత్తమమనీ, మంచి రాబడి వస్తుందనీ చాలామంది భావిస్తుంటారు. కానీ, మెరుగైన రాబడినిచ్చే సాధనం అదొక్కటే కాదు. షేర్లలో పెట్టుబడులనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన సమయమిది. అదెలాగో చూద్దాం...
ఇంతింతై
పదేళ్ల క్రితం 100 ఇన్ఫోసిస్ షేర్ల ధర సుమారు రూ.50 వేల వరకు ఉంది. వాటి విలువ ప్రస్తుతం రూ.3.50 లక్షలు. నాడు 100 ఐటీసీ షేర్ల ధర రూ.5 వేల వరకు ఉండగా, నేడది రూ.35 వేలకు పెరిగింది. అంటే, ఈ పదేళ్లలో ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్ల విలువ 600 శాతం వృద్ధిచెందింది. ఇదేకాలంలో 10 గ్రాముల పసిడి ధర రూ.5,800 నుంచి రూ.29 వేలకు చేరింది. అంటే, వృద్ధి రేటు 400 శాతం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయనడానికి ఇదో నిదర్శనం.
చౌకగా దొరికినపుడే
కంపెనీలు అభివృద్ధి సాధించేకొద్దీ వాటి షేర్ల విలువ పెరుగుతుంది. కంపెనీ లాభాల కంటే షేరు ధర పెరుగుదల రేటు తక్కువగా ఉంటే ఆ కంపెనీ షేర్లు చౌక ధరకే లభిస్తున్నట్లు లెక్క. దీన్నే పీఈ నిష్పత్తిలో లెక్కిస్తారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ పీఈ నిష్పత్తి ప్రస్తుతం మూడేళ్ల తక్కువ స్థాయిలో ఉంది. అంటే, ఆయా కంపెనీల అభివృద్ధి స్థాయి కంటే వాటి షేర్ల ధరలు తక్కువగా ఉన్నాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగదు. చౌక ధరలో లభిస్తున్నాయి కనుక షేర్లను కొనడానికి ఇదే సరైన సమయం.
విజయం మీదే
ఓ కంపెనీ షేర్లను మీరు కొన్నారంటే... ఆ కంపెనీలో కొంత భాగాన్ని మీరు కొన్నట్లే. ఆ కంపెనీ లాభాలను ఆర్జిస్తూ ఉంటే ఆ లాభాల్లో కొంత భాగం మీకూ వస్తుంది. కంపెనీ అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది. దేశం బాగుంటే ఆ దేశంలో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇవి పరస్పర ఆధారితాలు. అంటే, ఎలా చూసినా ఓ ఇన్వెస్టరుగా విజయం మీదేనన్న మాట.