
సాక్షి, హైదరాబాద్: బంగారం కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి బంగారం ధరలు 42 వేల మార్క్ను చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెపుతున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీన పడటం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పసిడి కొనుగోళ్లు వంటి అంశాలు దేశంలో పసిడి ధర పరుగుకు దోహదపడతాయని అంచనా. డిసెంబర్ నాటికి అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్ నైమెక్స్లో ఒక ఔన్స్ (28.3 గ్రాముల) బంగారం ధర 1,650 డాలర్లకు చేరవచ్చు అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బంగారం ధరలను దేశీయంగా పరుగులు పెట్టించే అవకాశం ఉంది.