సమైక్య శంఖారావం సభకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావం బహిరంగ సభను నేడు ఎల్ బీ స్టేడియంలో నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆ సభకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
మహిళలు ఫతేమైదాన్ వైపు ఉన్న 'ఏ గేట్' నుంచి ప్రవేశించాలని, నిజాం క్లబ్ వైపు ఉన్న 'ఎఫ్ గేట్' నుంచి వీఐపీలు, కేఎల్కే బిల్డింగ్ వైపు ఉన్న 'డీ గేట్' నుంచి వీవీఐపీలకు, అలాగే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వైపు ఉన్న 'ఎఫ్1 గేట్'తోపాటు ఆయకార్ భవన్ వైపు ఉన్న 'జీ గేట్ 'నుంచి ప్రజలు ప్రవేశించేందుకు వీలుగా ఎల్బీ స్టేడియంలో ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. సమైక్య శంఖారావం సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు, సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేర్లు పెట్టినట్లు తెలిపింది.