వేట ఇక ముమ్మరం | The hunt increased | Sakshi
Sakshi News home page

వేట ఇక ముమ్మరం

May 20 2015 3:00 AM | Updated on Aug 21 2018 5:46 PM

ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారం చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

►ఎర్రచందనంతో దండలు, బొమ్మలు తయారు చేస్తున్న వారిపై పోలీసుల ద ృష్టి
►హర్యానా, హైదరాబాద్‌కు చెందిన స్మగ్లర్ల గుర్తింపు
►పీడీ యాక్ట్‌ను సవ్యంగా ఉపయోగిస్తే స్మగ్లింగ్‌కు కొంత అడ్డుకట్ట
►అధికారులకు తెలిసే వ్యాపారం చేశానంటున్న బదాని
►బదానిని విచారిస్తే మరిన్ని వివరాలు ఖాయం

 
 సాక్షి, కడప :  ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారం చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శేషాచలం అడవుల్లో తమిళనాడుకు చెందిన ఎర్ర కూలీల ఎన్‌కౌంటర్ మొదలు చర్చ మరింత తీవ్రమైంది. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠి  టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి ఎర్రచందన అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి స్థావరాలను పెకిలిస్తుండటంతో స్మగ్లర్లలో దడ మొదలైంది. వారం క్రితం బి.మఠం మండలానికి చెందిన విజయనరసింహారెడ్డి అనే స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

అతడు ఇచ్చిన సమాచారం మేరకే హైదరాబాద్‌కు చెందిన అజయ్‌ని అదుపులోకి తీసుకొని కూపీ లాగుతున్నారు. అజయ్ సహాయంతోనే అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదానిని హర్యానాలో పట్టుకున్నట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన సోంబేర్ సింగ్, కరంబీర్‌లతోపాటు హైదరాబాద్‌కు చెందిన సంజయ్, వినోద్‌ల కోసం కూడా అన్వేషణ సాగుతోంది. ఈ నేపథ్యంలో రహస్య స్థావరాలకు వెళ్లి దాక్కున్న స్మగ్లర్ల గురించి నిఘాృబందం ఆరా తీస్తోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మరి కొందరు దాక్కున్నారనే సమాచారం మేరకు వారిని పట్టుకొనేందుకు వ్యూహ రచన చేసినట్లు సమాచారం.

 వణుకు పుట్టిస్తున్న బదాని వ్యవహారం
 హర్యానాలో పట్టుబడ్డ అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేష్ బదానిని వారం పాటు కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. అతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తే పలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణాతో తనకు సంబంధంలేదని, ఫారెస్ట్ అధికారులతో మాట్లాడిన తర్వాతే రుద్రాక్షలు, ఇతర దండల కోసం అధికారికంగానే ఎర్రచందనం కొనుగోలు చేశానని బదాని చెబుతున్నాడు. ఈ మాటలు అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. కాగా, ఎర్రచందనంతో రుద్రాక్షలు, బొమ్మలు, దండలు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్న వారిపై వైఎస్‌ఆర్, చిత్తూరు జిల్లా పోలీసులు దృష్టి సారించారు. ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న ఈ స్మగ్లర్ల కోసం ప్రత్యేకృబందాలను పంపే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

రెండేళ్లల్లో 10 మందిపై పీడీ యాక్టు
 ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా పోలీసులు స్మగ్లర్లపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్టు అమలు చేస్తున్నారు. ఈ యాక్టు అమలు చేయడం ద్వారా ఏడాది పాటు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. ఎర్రచందనం రవాణాను అదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గడిచిన రెండేళ్లలో 10 మందిపై పీడీ యాక్టు నమోదైంది. తాజాగా బొడ్డే వెంకటరమణపై పీడీ యాక్టు అమలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. మరికొంత మంది స్మగ్లర్లపై కూడా పీడీ యాక్టు తెరిచేందుకు సన్నద్ధమవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement